
వాడకాన్ని ఆపుదాం.. ప్లాస్టిక్ను అంతం చేద్దాం
హొసపేటె: ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత జీవనశైలి అలవర్చుకుంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అర్థవంతంగా జరుపుకుంటామని అదనపు జిల్లాధికారి బాలకృష్ణప్ప అన్నారు. నగరంలోని విజయనగర కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సంవత్సరం ప్రభుత్వం పర్యావరణ దినోత్సవ వేడుకల కోసం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయండి అనే నినాదాన్ని విడుదల చేసిందన్నారు. కాలుష్య నియంత్రణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. అవగాహన కల్పించడానికి ప్రజలు, సంఘసంస్థలు ప్రభుత్వంతో చేతులు కలపాలన్నారు. కూరగాయలు, పాలు, కిరాణా సామగ్రిని కొనడానికి ప్లాస్టిక్ వాడకాన్ని ఆపి వేద్దాం. ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు వేసి చెత్త వాహనాలకు ఇద్దాం. మీ చిన్న చర్యలు పర్యావరణానికి మేలు చేస్తాయి. ప్లాస్టిక్ వాడకాన్ని విడిచిపెట్టి కాలుష్యాన్ని అంతం చేయడానికి మనమందరం ఒక తీర్మానం చేద్దాం అని ఆయన అన్నారు. ముందుగా తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మకు నివాళులర్పిస్తూ మౌన జాగరణ పాటించారు. నగరంలోని విజయనగర కళాశాల నుంచి డాక్టర్ పునీత్రాజ్కుమార్ సర్కిల్ వరకు వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పర్యావరణ అవగాహన గురించి నినాదాలు చేస్తూ ఊరేగించారు. పర్యావరణ, వన్యప్రాణి నిపుణుడు డాక్టర్ అబ్దుల్ సమద్ కొట్టూర్, పర్యావరణ అధికారి హెచ్ఎం మీనాక్షి, సీనియర్ పర్యావరణ అధికారి బీఎస్ మురళీధర్, విజయనగర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం ప్రభుగవాడ, పర్యావరణ వేత్త రవికుమార్, కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయ సిబ్బంది మంజునాథ్, శేఖరప్ప పాల్గొన్నారు.