
లారీ ఢీకొని బస్సు బోల్తా.. ఒకరి మృతి
దొడ్డబళ్లాపురం: బస్సును లారీ ఢీకొని వృద్ధురాలు మృతిచెందగా 15మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన బెళగావి జిల్లా గోకాక్ తాలూకా బెణచినమరడి గ్రామం వద్ద చోటుచేసుకుంది. బైలహొంగల–గోకాక్ మధ్య సంచరించే కేఎస్ఆర్టీసీ బస్సు బెణచిమరడి వద్దకు రాగానే లారీ వేగంగా ఢీకొంది. దీంతో బస్సు రోడ్డు పక్కన బోల్తా పడింది. కొళవి గ్రామం నివాసి యల్లవ్వ(70) బస్సు కింద చిక్కి మృతి చెందింది. ప్రయాణికులు కిటికీ అద్దాలు పగులగొట్టుకొని ప్రాణాలతో బయట పడ్డారు. వీరిలో గాయపడిన 15 మందికిపైగా ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. గోకాక్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.