
సదాశయానికి సవాళ్లు
బనశంకరి: ఒక గొప్ప ఆశయానికి ఆటంకాలు తప్పడం లేదు. రోడ్డు ప్రమాదాలతో పాటు వివిధ సందర్భాలలో బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తుల అవయవ దానానికి చాలా వరకు కుటుంబసభ్యులు అంగీకరించడం లేదు. దీంతో అవయవదానానికి సదరు వ్యక్తి జీవించి ఉన్నప్పుడు పేరు నమోదు చేసుకున్నప్పటికీ, బ్రెయిన్డెడ్ తరువాత అవయవ దానం సాధ్యపడడం లేదు. ఇటువంటి సంఘటనలు తరచూ సంభవిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
విస్తృతంగా అవగాహన
అవయవదానం ద్వారా మరణం తరువాత కూడా సమాజానికి సహాయపడాలనే ఆశయం నెరవేరడం లేదు. రాష్ట్రంలో ఆరోగ్యశాఖతో పాటు వివిధ ప్రభుత్వేతర సంస్థలు , ఆసుపత్రులు అవయవ దానం పట్ల జాగృతం చేస్తున్నారు. జాతీయ అవయవదాన సంస్థ (నోట్పో), రాష్ట్ర స్థాయిలో జీవ సార్థకత సంస్థ కూడా ముమ్మరంగా జాగృతి కల్పిస్తున్నాయి. తద్వారా అవయవదానం పట్ల ప్రతిజ్ఞ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. నోట్పో కింద 36 వేలమంది, జీవ సార్థకత ద్వారా 43 వేలమందికి పైగా తాము అవయవదానం చేస్తామని పేర్లు నమోదు చేసుకున్నారు. సర్టిఫికెట్లు కూడా అందుకున్నారు. కానీ తరువాత పరిస్థితి మారుతోంది. బ్రెయిన్డెడ్ అయినప్పుడు వైద్యులు, సంస్థల ప్రతినిధులు వారి పేర్లు జీవ సార్థకతలో ఉన్నా, లేకపోయినా, అవయవ దానం చేస్తారా అని కుటుంబ సభ్యులు అడుగుతారు. చాలాసార్లు కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండకపోడం, మూఢ నమ్మకాల వల్ల తిరస్కారమే ఎదురవుతుంది.
ఐదేళ్లలో 619 మందే
బ్రెయిన్డెడ్ కాబడిన ఏ వయసువారైనా అవయవదానం చేయవచ్చు. ఇది చట్టబద్ధం. రాష్ట్రంలో 2007 నుంచి జీవ సార్థకత స్కీం కింద అవయవదానం, అవయవాల సేకరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలో ఐదేళ్లలో 619 మంది నుంచి అవయవాలను తీసుకున్నారు.
జాగృతి పెరగాలి: మంత్రి
జీవ సార్థకత సంస్థ ప్రకారం ఒకరి దేహం నుంచి సేకరించే గుండె, మూత్రపిండాలు, కళ్లు, శ్వాసకోశం తదితరాల ద్వారా 8 మందికి మెరుగైన జీవితం లభిస్తుంది. అవయవదానం పట్ల ప్రజల్లో జాగృతం చేయాలి, ప్రాణాలు కాపాడే అవయవాలు చాలా అవసరంగా ఉన్నాయని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు.
అవయవదానం గురించి సౌధ
ముందు ర్యాలీ (ఫైల్)
ఇటీవల బెంగళూరులో ఓ వ్యక్తి యాక్సిడెంటులో బ్రెయిన్డెడ్ అయ్యారు. దేహంలోని ముఖ్య అవయవాలు ఆయనతో పాటు మట్టిలో కలిసిపోతాయి. ఇదే విషయాన్ని చెప్పి అవయవ దానం చేయాలని వైద్యులు కోరగా, కుటుంబ సభ్యులు లేదు అని చెప్పారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అవయవ దానం ద్వారా ఇతరుల జీవితాల్లో వెలుగు నింపవచ్చనే ఆశయం పూర్తిగా నెరవేరడం లేదు.
దీర్ఘకాల జబ్బులు, ప్రమాదాల బారిన పడిన ఎంతో మంది అవయవ వైఫల్యంతో బాధపడుతున్నారు. మంచానపడి రోజులు లెక్కబెడుతున్నారు. అటు కుటుంబానికి కూడా ఆర్థికంగా భారం అవుతోంది. అవయవాల కోసం ఎదురుచూసేవారి సంఖ్య ఏటేటా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలతో పాటు ఆకస్మిక అనారోగ్యాలతో ఆసుపత్రుల్లో చేరి బ్రెయిన్డెడ్ అయినవారి కుటుంబసభ్యులకు డాక్టర్లు అవయవ దానం గురించి జాగృతం చేస్తున్నారు. కొందరు అంగీకరిస్తారు, కొందరు ఒప్పుకోవడం లేదు. అవయవదానం పట్ల ప్రతిజ్ఞ చేసేవారు ఎక్కువే కానీ అవయవదాన ప్రక్రియ గణనీయంగా పెరగడంలేదు. సమాచారం కొరత, కొన్ని రకాల నమ్మకాల వల్ల కుటుంబసభ్యులు వెనుకంజ వేస్తున్నారు.

సదాశయానికి సవాళ్లు

సదాశయానికి సవాళ్లు

సదాశయానికి సవాళ్లు

సదాశయానికి సవాళ్లు