
ఉగ్రదాడి పిరికిపంద చర్య
సాక్షి, బళ్లారి: కశ్మీర్లో అమాయక ప్రజలపై ఉగ్రవాదులు దాడి చేసి హత్య చేయడం దారుణం అని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి మండిపడ్డారు. బుధవారం రాత్రి నగరంలోని రాయల్ సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు హిందూ పర సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన 30 మందికి శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉగ్రవాదుల దాడులను కూకటి వేళ్లతో పెకలించాలన్నారు. దేశంలో భయభ్రాంతులను సృష్టిస్తున్న ఉగ్రవాదుల దాడులను ఖండించాలన్నారు. పర్యాటక రంగానికి పేరు గాంచిన కశ్మీర్ను తిలకించడానికి వెళ్లిన హిందువులపై కాల్పులు జరిపి చంపడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. హిందువులపై మారణకాండపై కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకొని నివారిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఈ ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం వారి గుండెల్లో దడ పుట్టించాలన్నారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు వైఎం సతీష్, బీజేపీ నాయకులు రామలింగప్ప, కేఎస్.దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
కశ్మీర్లో ఉగ్రదాడి దుర్మార్గం
రాయచూరు రూరల్: జమ్మూకశ్మీర్లో బైసారన్, పహల్గాంల మధ్య మంగళవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపి పర్యాటకులను హతమార్చడం దుర్మార్గం, ఖండనీయమని యువజన కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మరిస్వామి మాట్లాడారు. కశ్మీర్లో ఉన్న ఆర్టికల్–370ని రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన సంభవించిందన్నారు. ఈ విషయంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి తప్పు చేిసిన వారికి ఉరిశిక్ష వేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్కు తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫైజల్ ఖాన్, శాబాజ్, మధు, రషీద్, సంతోష్, అబ్దుల్, ఇస్మాయిల్, సురేష్, రఫీ, ప్రతాప్రెడ్డిలున్నారు.
ఏబీవీపీ రాస్తారోకో
హుబ్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యటనలకు, విహారయాత్రల కోసం వెళ్లిన భారతీయులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడిపై అంతటా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. విద్యానగర్లోని బీవీబీ కళాశాల ఎదురుగా సమావేశమైన ఏబీవీపీ కార్యకర్తలు, వేలాది మంది విద్యార్థులు మానవహారం నిర్మించి నిరసన వ్యక్తం చేశారు. అంతేగాక టైర్లకు నిప్పు పెట్టి ఆక్రోశం వెళ్లగక్కారు. హిందువులే లక్ష్యంగా తుపాకులతో కాల్పులు జరిపి 30 మందిని హత్య చేసిన జిహాది మూకలను కూడా అదే విధంగా కాల్చి చంపాలని ఆందోళనకారులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తమకు న్యాయం కావాలని, జమ్ముకశ్మీర్ను ఉగ్రవాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనలో ఏబీవీపీ కార్యదర్శి మణికంఠ కళసా, ఏబీవీపీ ప్రముఖులు మౌనేష్గౌడ, సిద్ధార్థ కోరి, విజయ కల్లూర, నాగదత్త, దానేష్ కిత్తూర, సంజన హిరేమఠ, రక్షిత, హర్షిత, రాజేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
కశ్మీర్ ఘటన అత్యంత దారుణం
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి

ఉగ్రదాడి పిరికిపంద చర్య