
పార్కింగ్కు చోటేది?
● కొంచెం స్థలం కూడా
వదలకుండా నిర్మాణాలు
● సెల్లార్లలోనూ దుకాణాల ఏర్పాటు
● రోడ్లపైనే వాహనాలను
నిలపాల్సిన పరిస్థితి
● ఇబ్బందిపడుతున్న వాహనదారులు, పాదచారులు
● పట్టించుకోని అధికారులు
కామారెడ్డి టౌన్ : నాలుగు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. జిల్లా కేంద్రం అయ్యాక రాకపోకలు మరింత పెరిగాయి. అయితే వాహనాలను నిలిపేందుకు స్థలం లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. రోడ్లపైనే వాహనాలను నిలపాల్సి వస్తోంది. నిబంధనలప్రకారం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేప్పుడు సెల్లార్ను పార్కింగ్కోసం వదలాల్సి ఉంటుంది. కానీ సెల్లార్లను నిర్మించినా.. వాటిలోనూ దుకాణాలను ఏర్పాటు చేశారు. కొందరు డ్రెయినేజీలు, రోడ్లను ఆనుకొని నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లతో పాటు వ్యాపార సముదాయాల ఏరియాల్లో పార్కింగ్ స్థలాలు లేక వాహనాలను రోడ్లపైనే నిలపాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. రద్దీ సమయాల్లో ఆయా రోడ్లపై నడవడం కూడా ఇబ్బందిగా ఉంటోంది. ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా బల్దియా అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
అనుమతులు ఒకలా.. నిర్మాణం మరోలా..
జిల్లా కేంద్రంలో 25 వేల వరకు గృహాలున్నాయి. ప్రధాన రోడ్లపై వ్యాపార దుకాణాలు 5,500 లకుపైగా ఉన్నాయి. సెల్లార్లతో కూడిన భవనాలు 50 కిపైగా ఉంటాయి. కొన్ని సెల్లార్లలో వ్యాపార దుకాణాలను నిర్మించుకుని యజమానులు యథేచ్ఛగా అద్దెలకు ఇచ్చుకున్నారు. చాలా భవనాలు సెట్ బ్యాక్ లేకుండా రోడ్లు, మురికి కాలువలపైనే నిర్మించారు. వీరంతా మున్సిపాలిటీ అనుమతుల ఒకలాగా ప్లానింగ్ తీసుకుని, నిర్మాణాలు మాత్రం మరొకలా చేపట్టారు.
ఓపెన్ స్థలాలలో ఏర్పాట్లు చేస్తే..
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే చోట మున్సిపాలిటీకి సంబంధించిన ఓపెన్ స్థలాలున్నాయి. వీటిలో వాహనాలను నిలిపేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే సుభాష్రోడ్, మాయాబజార్, వీక్లీమార్కెట్రోడ్, నాజ్టాకీస్ రోడ్ల పార్కింగ్ సమస్య తీర్చేందుకు గాంధీగంజ్లో, పొట్టిశ్రీరాములు విగ్రహం పక్కన, గంజ్ ప్రభుత్వ స్కూల్ ముందు, లయన్స్ క్లబ్ సమీపంలోని మున్సిపల్ స్థలాలను పార్కింగ్ కోసం వినియోగించుకుంటే ట్రాఫిక్ సమస్య కొంత తీరే అవకాశాలున్నాయి.
చర్యలు తీసుకుంటాం
పట్టణంలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు అనుమతి లేని సెల్లార్ల యజమానులకు, రోడ్లపై ఆక్రమణదారులకు నోటీసులను జారీ చేస్తాం. వ్యాపార, వాణిజ్య దుకాణాల వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలని వాటి నిర్వాహకులకు సూచిస్తాం. పోలీసు శాఖ సమస్వయంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. వాహనదారులు సైతం ప్రధాన రోడ్లు, చౌరస్తాలలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు అలా నిలపకూడదు.
– రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి
అంతటా ట్రాఫికర్..
జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లు, కూడళ్లతో పా టు, గల్లీల్లోనూ పార్కింగ్ సమస్య నెలకొంది. సుభాష్రోడ్, మాయాబజార్, నాజ్టాకీస్రోడ్, సిరిసిల్లరోడ్, వీక్లీమార్కెట్రోడ్, స్టేషన్రోడ్, పోలీస్స్టేషన్రోడ్, నిజాంసాగర్చౌరస్తా, జాతీ య రహదారి, కొత్తబస్టాండ్, దేవునిపల్లిరోడ్, జన్మభూమిరోడ్, అశోక్నగర్ కాలనీ, పాతబస్టాండ్, అడ్లూర్రోడ్లలో పార్కింగ్ సమస్య తీ వ్రంగా ఉంది. కొత్తబస్టాండ్, నిజాంసాగర్ చౌర స్తా ముందు హోటళ్లు, బార్లు, వ్యాపార దుకాణాల ముందు పార్కింగ్ స్థలం లేక రోడ్లపైనే వాహనాలను నిలుపుతున్నారు. అలాగే పాతబస్టాండ్, సిరిసిల్లరోడ్లో బ్యాంకుల ముందు కూడా రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. గల్లీల లో కూడా డ్రెయినేజీ వరకు నిర్మాణాలతో పా ర్కింగ్కు సమస్యలు ఏర్పడుతున్నాయి.

పార్కింగ్కు చోటేది?