ప్రతిభ చూపితే స్కాలర్షిప్ మీదే
● విద్యార్థులకు మంచి అవకాశం
● ఈ నెల 7న ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్ష
● ఉమ్మడి జిల్లాలో కేంద్రాల ఏర్పాటు
● సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ
రాయవరం: ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉపకార వేతనాలు అందిస్తోంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పేరుతో ఏటా ప్రతిభ చూపిన విద్యార్థులకు నాలుగేళ్ల పాటు (తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ పూర్తయ్యే వరకు) ఆర్థిక సాయం చేస్తోంది. దీని ద్వారా నెలకు రూ.1,000 వంతున ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం ఇస్తోంది. ఈ ఏడాది కూడా ఉపకార వేతనాలకు అర్హత పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష సమీపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 10,557 మంది
ఏటా నిర్వహించే ఈ పరీక్షకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లా పరిధిలో 10,557 మంది విద్యార్థులకు ప్రవేశ పరీక్షకు రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్రశ్నపత్రం ఇలా..
ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షలో 180 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో 90 మార్కులకు రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ ఉండగా, మరో 90 మార్కులకు 7వ తరగతి, ఎనిమిదో తరగతి గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలపై ప్రశ్నలుంటాయి. పరీక్ష రాసేందుకు మూడు గంటల సమయం ఇస్తారు.
మొదటి పేపరు
మెంటల్ ఎబిలిటీ (వెర్బల్ నాన్ వెర్బల్) పేపరు 90 మార్కులకు ఉంటుంది. నంబర్ సిరీస్ 10, సింపుల్ అర్థమెటిక్ 10, మిస్సింగ్ క్యారెక్టర్లు 10, వర్డ్ ఎనాలజీ 10, లెటర్ సిరీస్ 10 మార్కులు ఉంటాయి. నాన్ వెర్బల్ నుంచి 40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
రెండో పేపరు
రెండో పేపరు కూడా 90 మార్కులకు ఉంటుంది. ఇందులో గణితం 20 మార్కులు, సైన్స్లో పీఎస్కు 10, కెమిస్ట్రీ 10, బయాలజీ 10, సోషల్ సబ్జెక్టులో భూగోళం 10, చరిత్ర 10, పౌరశాస్త్రం 10, అర్థశాస్త్రం నుంచి 10 మార్కులుంటాయి. ఏడవ తరగతి పూర్తిగా, 8వ తరగతిలో నవంబర్ వరకూ పూర్తయిన సిలబస్ వరకు చదవాలి. కొన్ని జనరలైజ్డ్ బిట్లు, సబ్జెక్టు మీద, అదనపు సమాచారం, కరెంట్ ఎఫైర్స్పై కూడా తగిన జ్ఞానం కలిగి ఉండాలి.
బబ్లింగ్ విధానంలో..
విద్యార్థులు 180 నిమిషాల్లో 180 బిట్లకు సమాధానం రాయాల్సి ఉంటుంది. పేపర్ 1లో సమయాన్ని సద్వినియోగం చేసుకుని వేగంగా సమాధానాలు రాసి, అక్కడ మిగిలిన సమయాన్ని పేపర్–2లో గణితానికి వినియోగించుకుంటే విజయం సాధించడం చాలా సులభమని నిపుణులు చెబుతున్నారు. ప్రశ్న పత్రంలో 60 మార్కులకు సులభంగా, 60 మార్కులకు మధ్యస్థంగా, 60 మార్కులకు కఠినంగా ఇచ్చే అవకాశముంది. కనీసం 130 మార్కులు దాటిన వారికి విజయావకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఓఎంఆర్ షీటుపై బబ్లింగ్ విధానంలో సమాధానాలు రాయాలి.
పరీక్షా కేంద్రాల వివరాలు
జిల్లా కేంద్రాలు విద్యార్థులు
కోనసీమ 15 3,106
కాకినాడ 20 4,578
తూర్పుగోదావరి 13 2,873
మొత్తం 48 10,557
పకడ్బందీ ఏర్పాట్లు
ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. ఈ మేరకు సీఎస్, డీవోల నియామకం పూర్తి చేశాం. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా చూస్తున్నాం.
– షేక్ సలీం బాషా, డీఈవో,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఆదేశాలు జారీ చేశాం
ఎన్ఎంఎంఎస్ పరీక్షను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థులను ఉపాధ్యాయులు పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలి.
– జి.నాగమణి, ఆర్జేడీ,
పాఠశాల విద్యాశాఖ, కాకినాడ
ప్రతిభ చూపితే స్కాలర్షిప్ మీదే
ప్రతిభ చూపితే స్కాలర్షిప్ మీదే


