
ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్గా రాజ్కుమార్
రాజమహేంద్రవరం సిటీ: ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్గా కత్తుల రాజ్కుమార్ బుధవారం రాజమహేంద్రవరంలోని జోనల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన కరీంనగర్ జోన్ నుంచి పదోన్నతిపై ఇక్కడకు బదిలీపై వచ్చారు. రాజమహేంద్రవరం జోన్ పరిధిలోని కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 శాఖలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పటి వరకు జోనల్ కార్యాలయం పరిధిలో రూ.10,037 కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపారు.
25న ప్రవేశ పరీక్షలు
అమలాపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో 2025– 26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. పరీక్ష ఫలితాలను మే 14వ తేదీన విడుదల చేస్తారన్నారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి పరీక్ష జరుగుతుందన్నారు. ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కాలేజీల్లో పలు కోర్సుల్లో ప్రవేశానికి సైతం అదే రోజు పరీక్ష జరుగుతుంది.
హత్య కేసు రీ ఓపెన్
కాకినాడ క్రైం: ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన కేసును రీ ఓపెన్ చేయాలని ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలు జారీ చేశారు. 2022లో అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ ఎస్డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్ను విచారణ అధికారిగా నియమించారు. 60 రోజుల్లో దర్యాప్తు నివేదికను తనకు సమర్పించాలని ఆదేశాలలో పేర్కొన్నారు.
34,591 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
అల్లవరం: జిల్లా వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి బుధవారం నాటికి 34,591.60 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఎం. బాల సరస్వతి బుధవారం ప్రకటనలో తెలిపారు. బుధవారం సాక్షి దినపత్రికలో ప్రచురించిన ‘కళ్లాల్లో ధాన్యం, నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు’ కథనంపై పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించారు. అల్లవరం మండలంలో 18 రైతు సేవా కేంద్రాలు ద్వారా 395.720 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా అల్లవరం మండలంలో 1854 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఉందన్నారు. అమలాపురం రూరల్ పరిధిలో 22 రైతు సేవా కేంద్రాల ద్వారా 1040 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.