● మహబూబ్నగర్లో 50.53,నాగర్కర్నూల్లో 50.24శాతం మహిళా ఓటర్లు
● అభ్యర్థుల జాతకాలు తేల్చేది వీరే..
● వారిని ప్రసన్నం చేసుకోవడానికిప్రయత్నిస్తున్న నేతలు
మహబూబ్నగర్ డెస్క్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటములకు మహిళా ఓట్లే కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల గెలుపును శాసించేది వీరే. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో 16,82,470 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 50.53 శాతంతో 8,50,172 మంది మహిళా ఓటర్లే ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 17,916 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. నాగర్కర్నూల్ లోక్సభ స్థానంలో 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో కూడా 50.24 శాతంతో 8,73,340 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 8,465 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలోని కొల్లాపూర్, కల్వకుర్తి సెగ్మెంట్ల పరిధిలో మినహా ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 12 సెగ్మెంట్లలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తేలింది.