
విద్యార్థుల బాధ్యత ఉపాధ్యాయులదే..
● విద్యాశాఖపై కలెక్టర్ సమీక్ష
జనగామ: సర్కారు బడుల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. ‘శిథిల గదులు– చదువులు ఆగం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. 2025–26 నూతన విద్యా సంవత్సరంలో విజయోస్తు 2.0 కార్యక్రమంలో భాగంగా బడిబాట నమోదు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ, అకాడమీక్ క్యాలెండర్, పది వార్షిక పరీక్షల ముందస్తు ప్రణాళిక తదితర వాటిపై అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీఈఓ భోజన్న, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులతో కలిసి గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి స్కూల్కు రెగ్యుల్గా వచ్చేలా మానిటరింగ్ చేయడంతోపాటు ప్రతి అంశాన్ని ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని ప్రతి రోజు నివేదిక రూపంలో అందించాలని ఆదేశించారు. పాఠ్యంశాల బోధనకు ఇబ్బంది కలగకుండ లీవ్ మేనేజ్మెంట్ చేసుకోవాలన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలన్నారు. పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, పంట సామగ్రి, నీరు, కూరగాయలు శుభ్రంగా ఉండాలన్నారు. కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు ముందు బెంచ్లో కూర్చునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 10వ తేదీ లోపు ఇంటర్లో చేరిన విద్యార్థుల నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పదో తరగతి ముందస్తు కార్యాచరణను మొదలు పెట్టాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే కేరిర్ గైడెన్స్ ఉండాలని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడాంశాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి పాఠశాలలో కనీసం 3 సోక్ పిట్స్ నిర్మాణం చేసి, వన మహోత్సవంలో పెద్దఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నషా ముక్త భారత్లో భాగంగా హై స్కూల్ విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ సారించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో బోధన మెరుగుపడాలన్నారు.

విద్యార్థుల బాధ్యత ఉపాధ్యాయులదే..