
కురిసిన వర్షం.. రైతన్న హర్షం
పత్తి, వరి పంటకు ఊపిరి
● రెండవసారి పత్తి విత్తనాలువిత్తుతున్న రైతులు
● ఆలస్యంగా ప్రారంభమైన వరి నాట్ల పనులు
● వ్యవసాయ క్షేత్రాల్లో సందడి
జనగామ: వానాకాలం సీజన్ రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. సీజన్కు ముందు మురిపించిన వర్షాలు, పత్తి విత్తులు, నారు మళ్లు సిద్ధం చేసుకున్న తర్వాత ముఖం చాటేశాయి. గడిచిన నెలరోజుల్లోగా వరణుడి పలకరింపు లేకపోవడంతో నాటిన విత్తనాలు మట్టిలో కలిసి పోగా, నారు మళ్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. దీంతో నాట్లు వేయడం కొంత ఆలస్యం జరుగగా, వర్షం కోసం అన్నదాతలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. రెండు రోజుల క్రితం కురిసిన మోస్తరు వర్షం పత్తి మొలకలు, నారు మళ్లకు ఊపిరిపోసింది. వరణుడి కరుణతో కురిసిన కంటి తుడుపు వర్షంతో వ్యవసాయ క్షేత్రాల్లో సందడి నెలకొంది.
3.40 లక్షల ఎకరాల్లో సాగు అంచనా..
జిల్లాలో వానాకాలం సీజన్లో 3.40 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, వేరుశనగ తదితర పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ ముందస్తుగా అంచనా వేసింది. పత్తి 1.25 లక్షలు, వరి 2.15 లక్షలు సాగు చేయనున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు పత్తి, 20వ తేదీ వరకు నాట్లు 70 శాతం మేర పూర్తి కావాల్సి ఉంది.
రైతన్నకు ఊరట..
జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులకు కొంత మేర ఊరట కలిగిస్తున్నాయి. ఇప్పుడప్పుడే భూగర్భ జలాలు పెరిగే అవకాశం లేనప్పటికీ, వరద నీరు పొలాల్లోకి వచ్చి చేరుతుంది. నార్లు పోసి సిద్ధంగా ఉంచుకోగా, నాట్ల కోసం దుక్కులు మొదలు పెట్టారు. పలుచోట్ల పత్తిలో కలుపు తీత పనులు జోరుగా సాగుతున్నాయి. పత్తి కొమ్మలు వా డి పోతున్న సమయంలో ఈ వాన జీవం పోసింది.
ఒక్కోరైతుకు రూ.10వేల నష్టం
ఈ సీజన్లో ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో ముందస్తుగా నాటిన పత్తి విత్తులు నేలలోనే మురికి పోయాయి. ఒక్కో రైతు రూ.5 నుంచి రూ.10 వేల వరకు నష్టపోయారు. ఇటీవల కురుస్తున్న మోస్తరు వర్షాలతో రెండవ సారి పత్తి విత్తులు నాటుతుండడంతో పెట్టుబడి భారం పెరిగిపోతుంది.
జిల్లాలో సాగు వివరాలు (ఎకరాల్లో)
పత్తి : 57,807
వరి : 42,342
కందులు : 605
పెసర : 278
ధైంచ : 10,127
మొక్కజొన్న : 4,007
మొత్తం సాగు : 1,15,166
వర్షపాతం వివరాలు(మిల్లీ మీటర్లు)
నెల కురియాల్సింది కురిసింది శాతం
జూన్ 124.2 56.8 మైనస్ 54 శాతం
జూలై 8.4 39.0 ప్లస్ 36 శాతం
పంటలకు ప్రాణం పోసింది..
వేల రూపాయలు ఖర్చు చేసి వరి, పత్తి పంట సాగు చేసిన. దుక్కుల నుంచి మొదలుకుని విత్తనాల కొనుగోలు, నారు మళ్లు, కూలీల ఖర్చు వేలల్లో ఉంది. పత్తి విత్తనాలు నాటి, నాట్లకు సిద్ధం చేసుకుందామంటే చినుకు జాడ లేదు. దీంతో ఆందోళన చెందాం. ప్రస్తుత వర్షం పంటలకు ప్రాణం పోసింది. – చెవుల రాజు, రైతు, నర్మెట

కురిసిన వర్షం.. రైతన్న హర్షం

కురిసిన వర్షం.. రైతన్న హర్షం