విద్యారంగానికి అధిక ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

విద్యారంగానికి అధిక ప్రాధాన్యం

May 31 2025 1:12 AM | Updated on May 31 2025 1:12 AM

విద్యారంగానికి అధిక ప్రాధాన్యం

విద్యారంగానికి అధిక ప్రాధాన్యం

స్టేషన్‌ఘన్‌పూర్‌: విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తాను.. ప్రభుత్వ విద్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శివునిపల్లిలోని జీఆర్‌ఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనంలో తాత్కాలికంగా నిర్వహించనున్నారు. 2025–26 విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే తరగతుల కు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్‌ రిజ్వాన్‌బాషాతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల ఏళ్లనాటి కల నెరవేరిందని, వచ్చే ఏడాదిలో డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా సంబంధిత అధికారులు పనిచేయాలని సూచించారు. ఫర్నిచర్‌, డిజిటల్‌ బోర్డులు, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్లు, తాగునీరు, టాయిలెట్లు తదితర సౌకర్యాలను నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం

డిగ్రీ కళాశాల తరగతి గదులను పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యేకు పరిసరాలు అపరిశుభ్రంగా కనిపించాయి. ఫర్నిచర్‌ చిందరవందరగా ఉండటంతో అసంతప్తి వ్యక్తం చేశారు. ‘ఇలా ఉంటే విద్యార్థులు ఎలా వస్తారు.. కమిట్‌మెంట్‌తో పనిచేస్తే చేయాలి.. లేదంటే వెళ్లిపోవచ్చు’ అని ప్రిన్సిపాల్‌ రాజిరెడ్డిపై ఎమ్మెల్యే సీరియస్‌ అయ్యారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ డీఎస్‌ వెంకన్న, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, డిగ్రీ, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ నర్సయ్య, రాజిరెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ లావణ్యశిరీష్‌రెడ్డి, అధ్యాపకులు సాంబమూర్తి, ప్రేమ్‌, థామస్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement