కొల్లగొడుతూ.. కోట్లు గడిస్తూ!
కోమటిపల్లి, మునిపల్లి గుట్టలను లూటీ చేస్తున్న మైనింగ్ మాఫియా
ఆనవాళ్లు కోల్పోయిన
కోమటిపల్లి గుట్ట..
మైనింగ్ మాఫియా ధనదాహానికి గుట్టలు లూటీ అవుతున్నాయి. గోరంత అనుమతి.. కొండంత తవ్వకాలు పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నాయి. రాయల్టీ ఎగవేతతో సర్కారు ఖజానాకు రూ.కోట్లలో గండి పడుతోంది. అనుమతి ఒకచోట.. తవ్వకాలు మరోచోట చేపడుతున్న మైనింగ్ వల్ల ప్రభుత్వ ఆదాయం రూ.లక్షల్లో పక్కదారి పడుతోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పర్యావరణ శాఖలు ‘మామూలు’ గా తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.
సాక్షిప్రతినిధి, వరంగల్:
సహజ వనరుల దోపిడీ వ్యాపారులకు వరంగా, ప్రజలకు శాపంగా మారుతోంది. మొరం, మట్టి, కంకర, గ్రానైట్.. ఇలా విచ్చలవిడిగా తరలిపోతున్నాయి. టెంపరరీ, పర్మనెంట్ అనుమతుల పేరిట ప్రభుత్వ భూములు, గుట్టలను మైనింగ్ మాఫియా కొల్లగొడుతోంది. మొరం తవ్వకాలు, క్రషర్లు, గ్రానైట్ల కోసం పేల్చే బ్లాస్టింగ్తో గాలి, పొలాలు, నీటి వనరులు కాలుష్యం బారిన పడుతున్నాయి. మొరం, కంకర, గ్రానైట్ తరలింపు కోసం పావలా రాయల్టీ చెల్లించి బారాణా లాభం పొందుతున్నా అధికారులు ‘కొలతలు’ పట్టించుకోవడం లేదు. మటి, కంకర తరలింపుతో గుట్టలు ఆనవాళ్లు కోల్పోతున్నా చర్యలు తీసుకోవడం లేదు.
క్రషర్ క్వారీలు, గ్రానైట్ బ్లాకులు..
గ్రానైట్, కంకర క్రషర్ దందాకు గుట్టలు గుల్ల అవుతున్నాయి. పచ్చదనం నేలకొరుగుతోంది. కొన్నిచోట్ల అసలు అనుమతే లేకుండా తవ్వుకుపోతున్నారు. మరికొన్నిచోట్ల అనుమతి తీసుకున్నా.. పరిమితికి మించి, హద్దులు దాటి కొండలను కరిగిస్తున్నారు. విలువైన రాళ్లను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాదు.. జీవవైవిధ్యం అలరారే అందాల అడవులను, వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆది మానవుల ఆవాస ప్రాంతాలనూ ధ్వంసం చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 64 కలర్, బ్లాక్ గ్రానైట్ క్వారీలు, 85 స్టోన్, మెటల్ క్రషర్లు ఉన్నాయి. హసన్పర్తి, శాయంపేట, కాజీపేట, హనుమకొండ, పరకాల ఏరియాల్లోని స్టోన్, మెటల్ క్రషర్లకు బాగా డిమాండ్ ఉంది. దీంతో చాలా మంది భారీ మిషన్లను పెట్టి రాత్రింబవళ్లూ బ్లాస్టింగ్ చేస్తూ గుట్టలను కొల్లగొడుతున్నారు. స్టోన్ తీసిన పరిమితి.. రాయల్టీకి లెక్కలు కుదరడం లేదు. రెండు నెలల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ టాస్క్ఫోర్స్ తనిఖీల్లో రూ.లక్షలాది రూపాయల బాగోతం బయట పడగా.. 22 గ్రానైట్, స్టోన్ క్రషర్లకు పెనాల్టీ వేశారు. కొన్నింటిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లాయి. మునులు కొలువున్న మునిపల్లి గుట్ట పూర్తిగా ఆనవాళ్లు కోల్పోతోంది. మునుల జ్ఞాపకార్థం నిర్మించిన గుడి వరకు తవ్వకాలు వెళ్లాయి. ఇలా చాలా చోట్ల ఇష్టారాజ్యంగా సాగుతున్న మైనింగ్పై మైనింగ్ శాఖ, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ శాఖ, దుమ్ముధూళిపై పర్యావరణ శాఖలు మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ విషయమై మైనింగ్ శాఖ అధికారితో ‘సాక్షి’ మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఫోన్లో అందుబాటులోకి రాలేదు.
అనుమతులు గోరంత.. తవ్వేది,
తరలించుకుపోయేది కొండంత
పొంతన లేకుండా రాయల్టీ లెక్కలు.. సర్కారు ఖజానాకు గండి
రెవెన్యూ, మైనింగ్, పర్యావరణశాఖ అధికారుల ప్రేక్షక పాత్ర
గ్రేటర్ వరంగల్ పరిధి హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం భీమారం రెవెన్యూ శివారులోని కోమటిపల్లి గుట్ట ఆనవాళ్లు కోల్పోయింది. 340/1 సర్వేనంబర్ పేరిట 3.260 రెండున్నర హెక్టార్ల భూమిని ఒకరికి క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి 5 ఏళ్ల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్అండ్1/ డబ్ల్యూజీఎల్/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. అయితే ఇందులో అప్పటి భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్ పార్ట్నర్గా ఉండగా.. సరిగ్గా పట్టించుకోలేదు. 29,90,900 క్యూబిక్ మీటర్ల మొరం అందుబాటులో ఉన్న ఈ క్వారీ నుంచి తీసే ప్రతీ క్యూబిక్ మీటరుకు రూ.30 చొప్పున ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. అంతకు ఐదింతలు మొరం తరలించి కోమటిపల్లి గుట్టను ఆనవాళ్లు కోల్పోయేలా చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా లక్షలాది రూపాయలు మైనింగ్ మాఫియా జేబుల్లోకి వెళ్లాయి.
కొల్లగొడుతూ.. కోట్లు గడిస్తూ!


