
తెలుగు సాహితీ సంబరాల్లో తెనాలి కవులు
రంగిశెట్టి రమేష్కు కవిరత్న సాహితీ పురస్కారం
తెనాలి: ఏలూరులో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈనెల 10, 11 తేదీల్లో 48 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీ సంబరాల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి జాతీయ ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. తెనాలికి చెందిన కవి, రచయిత డాక్టర్ రంగిశెట్టి రమేష్కు కవిరత్న సాహితీ పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. ప్రముఖ సాహితీవేత్తలు, కళాకారుల సమక్షంలో సంస్థ సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ కార్యదర్శి ఈశ్వరి భూషణం, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి ఈ అవార్డును అందజేశారు. గత నాలుగు దశాబ్దాలుగా సాహితీ సేద్యం చేస్తూ, వచన కవితా ప్రక్రియలో ఇప్పటికీ రోజుకో సామాజిక అంశంతో కవితను రాస్తూ, సామాజిక చైతన్యంతో పాటు తెలుగుభాషా వికాసానికి రమేష్ కృషి చేస్తున్నారు.
ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగు భాషా
సేవా సాహితీ పురస్కారం...
ఇదే వేదికపై తెనాలికి చెందిన కవి, రచయిత, ఆర్టీసీ కండక్టర్ ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగుభాషా సేవా సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వృత్తిపరంగా గుంటూరు–2 ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆళ్ల నాగేశ్వరరావు, ప్రవృత్తిగా సాహితీ సేద్యం చేస్తున్నారు. వచన కవితా ప్రక్రియలో ఇప్పటికీ రోజుకో సామాజిక అంశంతో కవితను రాస్తున్నారు. సామాజిక చైతన్యం, తెలుగుభాషా వికాసానికి కృషి చేస్తున్నందున పురస్కారం అందజేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

తెలుగు సాహితీ సంబరాల్లో తెనాలి కవులు