
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు, పాఠకులు రోజులో కొంత సమయాన్ని గ్రంథాలయంలో గడిపి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. సోమవారం బృందావన్ గార్డెన్స్లోని మహిళా బాలల గ్రంథాలయలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో భద్రపర్చిన పురాతన గ్రంథాలు చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. ప్రస్తుతం గ్రంథాలయాలకు వచ్చే విద్యార్థులు, పాఠకుల సంఖ్య తగ్గిపోతోందని, ఇది సమాజానికి మంచిది కాదన్నారు. రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ ఎ.కృష్ణమోహన్ మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు పుస్తక పఠనంతో పాటు కథలు చెప్పడం, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, పెయింటింగ్, పేపర్ క్రాఫ్ట్, డాన్స్, జీకే తదితర అంశాల్లో శిక్షణ కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బారత్నమ్మ మాట్లాడారు. కార్యక్రమంలో ఏవీకే సుజాత, పౌర గ్రంథాలయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సీహెచ్ దీక్షితులు, జిల్లా గ్రంథాలయ సంస్థ సీనియర్ అసిస్టెంట్ మల్లంపాటి సీతారామయ్య, విశ్రాంత గ్రంథ పాలకుడు ఎస్ఎం సుభానీ, అధ్యాపకుడు శివారెడ్డి, మహిళా బాలల గ్రంథాలయ అధికారులు బి.శకుంతల, పి.సత్య శిరీష, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.