
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : అతిగా మద్యం తాగి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. బసినికొండ పంచాయతీ, పుంగనూరు రోడ్డు ఆంజనేయస్వామి గుడి వద్ద ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించి అరుగుపై పడుకుని ఉండి అలాగే మృతి చెందాడు. అతను స్థానికంగా గుజిరీ, ప్లాస్టిక్ సామానులు ఏరుకుని విక్రయించి వచ్చిన సొమ్ముతో మద్యం తాగుతూ స్థానికంగానే ఉండేవాడు. అయితే శుక్రవారం ఉదయం నుంచే మద్యం తాగుతూ స్థానికులకు కనిపించాడు. అనంతరం ఆంజనేయస్వామి గుడి పక్కనే ఉన్న అరుగుపై పడుకుని రాత్రి అరుగు నుంచి కిందకు జారిపడిపోవడంతో స్థానికులు గుర్తించి పరిశీలించారు. మృతి చెందినట్లు నిర్ధారించుకుని తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు, అతడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతడి సంబంధీకులు ఎవరైనా ఉంటే తాలూకా సీఐ ఫోన్ నెంబర్.9440796742, ఎస్ఐ 9440796743 కు తెలపాలన్నారు.