
దళితులంటే అంత చులకనా?
అనంతపురం: దళితులంటే సీఎం చంద్రబాబు నాయుడుకు చులకన భావం ఎందుకని వైఎస్సార్సీపీ యువజన విభాగం, ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందితే ‘కుక్కపిల్లను పడేసినట్లు పడేశారం’టూ సీఎం చేసిన వ్యాఖ్యలు దళితుల మనోభావాలను దెబ్బతీశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ‘దళితుల ఇళ్లలో ఎవరైనా పుట్టాలనుకుంటారా’ అని హేళనగా మాట్లాడారని, తరచూ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబుతో పాటు పత్రికలో ప్రచురించిన ‘ఈనాడు’ యాజమాన్యంపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అనంతపురం టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లారు. అయితే ఆ సమయంలో సీఐ, ఎస్ఐ లేరు. మూడు గంటలపాటు ఫిర్యాదు తీసుకోకుండా అవమానానికి గురి చేశారంటూ ఆందోళనకారులు ఆవేదన చెందారు. పోలీసులు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారా.. లేకపోతే రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారా అని ప్రశ్నించారు. పోలీసుల వైఖరిని తప్పుపడుతూ నినాదాలు చేశారు. సాకే చంద్రశేఖర్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ మాట్లాడుతూ సింగయ్య భార్య మేరీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు వచ్చి ఆ రోజు జరిగిన ఘటనపై స్పష్టత ఇచ్చారన్నారు. సింగయ్య ప్రమాదానికి గురైన వెంటనే వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తే పోలీసు అధికారులు అడ్డుజెప్పారన్నారు. అంబులెన్స్ వచ్చేంతవరకు తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన పోలీసులపైన, అధికారులపైన చర్యలు తీసుకోవాలన్నారు. సింగయ్యతో కలిసి అంబులెన్స్లో ప్రయాణించిన వారిని సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు. సీఎం బాటలోనే టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్, తదితరులు దళితులు శుభ్రంగా ఉండరని, వారికి పదవులు అక్కర్లేదని హేళన చేస్తున్నారని మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు ఇస్తే అందుకు సంబంధించి రశీదు కూడా ఇవ్వడం లేదని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండటంతో పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే చిరంజీవి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసబాబు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు మిద్దె నగేష్, కుళ్లాయిస్వామి, కార్పొరేటర్లు కమల్భూషణ్, శ్రీనివాసులు, సర్పంచులు సాకే రామాంజినేయులు, ఓబులేసు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పసలూరి ఓబులేసు, యువజన విభాగం నగర ఉపాధ్యక్షుడు వినీత్, ఉదయ్, నగర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జెడ్పీటీసీ భాస్కర్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, కార్యదర్శి సాకే ఆనంద్, ఎస్సీ సెల్ నాయకులు వడియం పేట అంజి, వెంకటేశ్, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సింగయ్యను కుక్కపిల్లతో
చంద్రబాబు పోల్చడంపై ఆగ్రహం
వైఎస్సార్సీపీ యువజన విభాగం, ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన
సీఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్
కింద కేసు నమోదు చేయాలని డిమాండ్
ఫిర్యాదు స్వీకరణకు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ వద్ద నిరసన