
నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా
● వారం రోజుల్లో మూడు కేసులు, ఐదుగురి అరెస్ట్ ● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వారం రోజుల్లో మూడు కేసులు నమోదు కాగా, ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 78 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, పది కిలోల లూజ్ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు నకిలీ, లూజ్ విత్తనాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. విత్తన ప్యాకెట్లపై సరైన లేబుల్, తయారీ, ఎక్స్పైరీ తేదీ ఉండేలా చూసుకోవాలని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే 8712659965 నంబర్లో సమాచారం అందించాలని తెలిపారు. సీసీఎస్ బృందం ఆధ్వర్యంలో పోలీసు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇచ్చోడలో నలుగురు, బేలలో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే శనివారం తలమడుగు మండలంలో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.