ఎన్ఎస్పీ డీఈపై సీఈ ఆగ్రహం
కురిచేడు : జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు మరో నాలుగైదు రోజుల్లో నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో కాలువల పరిస్థితిని ఎన్ఎస్పీ సీఈ వీరరాజు శనివారం పరిశీలించారు. కురిచేడు వద్ద దర్శి బ్రాంచి కాలువ హెడ్ రెగ్యులేటర్ నుంచి కాలువపై పర్యటించారు. కాలువ కట్టను ఆధునికీకరిస్తున్న క్రమంలో కంప చెట్లను కాలువలో పడేయడంపై సీఈ మండిపడ్డారు. అంతేగాకుండా కాలువ లైనింగ్ పనులు సక్రమంగా లేవని, పనులు జరగుతున్న సమయంలో అధికారులు ఎక్కడో ఉండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.
లెనింగ్కు కట్టకు మధ్య గ్యాప్ను మట్టితో నింపకపోవడాన్ని గమనించి దర్శి డీఈఈ కరిముల్లాపై చిందులు తొక్కారు. వర్షం కురిస్తే లైనింగ్ కొట్టుకుపోతుందని, పనిని జాగ్రత్తగా చేయించాలని చెప్పారు. బ్రాంచి కాలువలో రైతులు అడ్డుగా వేసిన కట్టలను తొలగించకపోవడం, ఆధునికీకరణ పనుల సమయంలో వాడిన మట్టి, రాళ్లను కాలువలో నుంచి తొలగించకపోవడంతో డీఈఈని నిలదీశారు.
ఇదిలా ఉండగా ప్యాకేజీల రూపంలో కోట్లాది రూపాయలతో కాలువ ఆధునీకరణ పనులు జరుగుతున్న సమయంలో వాటిని పరిశీలించాల్సిన సీఈ తన బాధ్యతను విస్మరించింది గాక కింది స్థాయి అధికారులపై చిందులు వేయడం విమర్శలకు తావిచ్చింది. ఆయన వెంట దర్శి ఈఈ బీఎస్వీ ప్రసాద్, దర్శి డీఈఈ కరిముల్లా, కురిచేడు ఏఈ శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు.