మన్మోహన్ వీడ్కోలు సందేశం!
సంపాదకీయం
నిర్వికారంగా, నిరాసక్తంగా ఉంటూనే దశాబ్ద కాలంపాటు దేశ ప్రధాని బాధ్యతలను నిర్వర్తించిన మన్మోహన్సింగ్ శుక్రవారంనాటి విలేకరుల సమావేశంలో ప్రజలకు దాదాపు వీడ్కోలు సందేశం ఇచ్చారు. తాను మరోసారి ప్రధాని పదవికి పోటీపడబోవడంలేదని ప్రకటించారు. ప్రధాని పీఠంపై ఉండేవారు కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి మాత్రమే కాదు...దేశానికంతకూ సారథి. చురుగ్గా స్పందించే స్వభావం, దేశ ప్రజలతో నిరంతరం సంభాషించే తత్వమూ ఆ పదవికి అవసరమైన ప్రాథమిక లక్షణాలు. కానీ, మన్మోహన్సింగ్ అందుకు భిన్నంగా మితభాషి. తనకంటూ కొన్ని పరిమితులు ఏర్పర్చుకుని పనిచేసే స్వభావం. అత్యంత క్లిష్టమైన సమస్యతో దేశం సతమతమవుతున్న సందర్భాల్లో సైతం ఆయన మీడియాకు అందుబాటులోకి రాలేదు.
ఏదైనా విదేశీ పర్యటన జరిపినప్పుడో, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భాల్లోనో మాట్లాడటం తప్ప... దేశ ప్రజలతో సంభాషించడం ఒక అవసరంగా ఆయన ఎన్నడూ భావించలేదు. శుక్రవారంనాటి విలేకరుల సమావేశం ఈ పదేళ్లలోనూ మూడవదంటేనే ఆయన ఎంత అంటీముట్టనట్టు వ్యవహరించారో అర్ధమవుతుంది. మితభాషిత్వంవల్ల ఆయన మనోభావాలేమిటో, ఫలానా మాట ఎందుకు ఉపయోగించారో తెలియని పరిస్థితులు చాలాసార్లు ఎదురయ్యాయి.
కొన్ని అంశాల్లో అత్యంత దృఢంగా వ్యవహరించినట్టు కనిపించిన మన్మోహనే మరికొన్ని అంశాల్లో పట్టనట్టు ఉండటం ఎందుకో ఎవరికీ అర్ధంకాని విషయం. ఉదాహరణకు అమెరికాతో అణు ఒప్పందం విషయంలో ఆయన తన ప్రభుత్వాన్నే పణంపెట్టే సాహసం చేశారు. అయితే, అంతకన్నా ఎక్కువగా దేశాన్ని కలవరపరిచిన విషయాల్లో మౌనమే ఆయన సమాధానమైంది. వరస కుంభకోణాలు బయటపడుతున్నా వాటిని నివారించడానికి ప్రయత్నించలేదు. చర్యలు తీసుకోవడానికి అసలే సిద్ధపడలేదు. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐని, ఇతర విభాగాలనూ ఎగదోస్తుంటే నివారించడానికి ప్రయత్నించలేదు. తన సహచర మంత్రులు సీబీఐని ప్రభావితం చేసి కుంభకోణాలను కప్పెట్టడానికి ఎత్తులు వేస్తున్నా ఆయనలో కదలిక లేదు. న్యాయ స్థానాల జోక్యం తర్వాతే అలాంటి మంత్రులు రాజీనామాలు చేశారు తప్ప తానుగా చర్య తీసుకున్నది లేదు.
తొలిసారి ప్రధాని అయినప్పుడు మన్మోహన్పై ఎగువ మధ్యతరగతి, సంపన్నవర్గాలు విపరీతమైన ఆశలు పెట్టుకున్నాయి. అందుకు కారణాలున్నాయి. దేశ గతినే మార్చిన ఆర్ధిక సంస్కరణలను కేంద్ర ఆర్ధికమంత్రిగా ప్రారంభించింది ఆయనే. అంతవరకూ పడుతూ లేస్తూ ఉన్న దేశ ఆర్ధిక వ్యవస్థ ఆయన హయాంలో వడివడిగా దౌడుతీసింది. అలాంటి వ్యక్తి నేరుగా ప్రధాని పీఠంపైనే ఉంటే ఇది మరింతగా వెలిగిపోతుందని వారు ఆశించారు. యూపీఏ తొలి దశ పాలనలో ఎంతో కొంత కొనసాగిన ఈ ఉత్సాహం కాస్తా రెండో దశకల్లా ఆవిరైపోయింది. పెరుగుతూపోయిన నిత్యావసరాల ధరలు, వృద్ధి రేటు మందగించడం, రూపాయి పతనం, ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటడంవంటివన్నీ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. వ్యవసాయ రంగం సైతం పెను సంక్షోభంలో పడిపోయింది.
విత్తనాల దగ్గరనుంచి ఎరువులు, పురుగుమందుల వరకూ అన్నింటి ధరలూ పెరిగిపోగా... వ్యవసాయ దిగుబడులకు గిట్టుబాటు ధరలులేవు. మౌలిక సదుపాయాల రంగంలో యూపీఏ ప్రభుత్వ వైఫల్యంకారణంగా వేల పరిశ్రమల మూతబడ్డాయి. లక్షలమంది కార్మికులు నిరుద్యోగులయ్యారు. పారిశ్రామిక ప్రగతి కుంటుబడటంతోపాటు స్టాక్ మార్కెట్లు నీరసించాయి. సౌమ్యంగా మాట్లాడే అలవాటున్న మన్మోహన్... నరేంద్ర మోడీ ప్రధాని అయితే అది పెనువిపత్తు అవుతుందని కటువుగా మాట్లాడారు. ఒకవేళ అది నిజంగా పెను విపత్తే అనుకున్నా... అలాంటిదేమైనా జరిగితే అందుకు తమ ప్రభుత్వ నిర్వ్యాపకత్వం, నిర్ణయ రాహిత్యం, అసమర్ధతలే ప్రధాన కారణాలవుతాయని మన్మోహన్ గ్రహించాలి.
కుంభకోణాలన్నీ యూపీఏ-1నాటివేనని అంటూనే 2009లో తమకు ప్రజలు క్లీన్చిట్ ఇచ్చారని మన్మోహన్ ఎలా అనగలిగారో అర్ధంకాదు. కుంభకోణాల్లో చాలాభాగం తొలి దశనాటివే అయినా బయటపడింది రెండోసారి గద్దెనెక్కిన తర్వాతే. ఇక ప్రజలు క్లీన్ చిట్ ఇచ్చే ప్రశ్న ఎక్కడ తలెత్తుతుంది? తాను సచ్చీలుడినని, తనవారెవరికీ ఏమీ దోచిపెట్టలేదని ఆయన చెప్పిన మాటలు సత్యదూరమని ఎవరూ అనలేరు.
కానీ తన హయాంలోనే వరస కుంభకోణాలు చోటుచేసుకోవడం, వాటిపై చర్య తీసుకోవడానికి చొరవ ప్రదర్శించకపోవడం వంటివన్నీ ఆయన ప్రతిష్టను పెంచేవి కాదు. నేర చరితులకు వెసులుబాటు కల్పించే ఆర్డినెన్స్ జారీ కావడానికి కారకులెవరో, ఎందుకంత తొందర ప్రదర్శించవలసి వచ్చిందోగానీ...ఆ చర్యను బహిరంగంగా రాహుల్గాంధీ వ్యతిరేకించి, నాన్సెన్స్ అని కొట్టిపారేసేవరకూ ఉపసంహరించుకోలేదు. నిష్కళంక చరితుడిగా, నిజాయితీపరుడిగా నిలిచిపోవాలని వాంఛించే వ్యక్తి వ్యవహరించవలసిన తీరేనా ఇది? ఆఖరికి ఆదర్శ్ కుంభకోణంలో నియమించిన కమిషన్ నివేదికను టోకుగా తిరస్కరించిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సరైనదోవలో పెట్టడానికి రాహుల్గాంధీయే జోక్యం చేసుకోవాల్సివచ్చింది. రాజకీయాధికారం సర్వమూ సోనియాగాంధీ, రాహుల్గాంధీ వద్ద ఉండిపోతే మన్మోహన్ కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోయారని ఇలాంటి ఉదంతాలు చెప్పకనే చెప్పాయి. మొత్తానికి మేథావిగా, విద్యావేత్తగా, ఆర్ధికవేత్తగా, ఆర్ధిక మంత్రిగా రాణించిన మన్మోహన్ ప్రధానిగా మాత్రం వైఫల్యాలనే మూటగట్టు కున్నారు. ఇందుకు కారణాలేమిటన్నది ఆయన నోరువిప్పితేగానీ తెలిసే అవకాశం లేదు. కానీ, మరో అయిదునెలల్లో పదవినుంచి వైదొలగే ఈ తరుణంలో కూడా మన్మోహన్ ‘పెద్దమనిషి’గానే మిగిలిపోదల్చుకున్నారని ఆయన మాటల తీరే చెబుతోంది. ఇక చరిత్ర తనపై దయదల్చాలని కోరుకోవడం అత్యాశ కాదా... మన్మోహన్ ఆలోచించాలి.