పుష్కర స్నానం చేయకముందే పరలోకానికి..
ఒరే బాబూ.. పుష్కరాలకు ఎల్దాంరా...
రాజమండ్రి దుర్ఘటనలో
జిల్లా వాసులు ముగ్గురు మృతి
కోమాలో ఇద్దరు.. మరో ఇద్దరికి గాయాలు
దంపతుల ఆచూకీ గల్లంతు
విషాదంలో కుటుంబ సభ్యులు, బంధువులు
పుష్కర స్నానం చేయకముందే వారు పరలోకానికి వెళ్లిపోయారు. తమవారికి అంతులేని దుఃఖాన్ని మిగిల్చారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్న దుర్ఘటనలో జిల్లాకు చెందిన ముగ్గురు కన్నుమూశారు. మరో ఇద్దరు కోమాలోకి వెళ్లిపోయారు. దంపతులిద్దరి ఆచూకీ గల్లంతు కాగా మరో ఇద్దరు గాయపడ్డారు.
బాడంగి, బొబ్బిలి : ‘ఒరే బాబు.. గోదావరి పుష్కరాలకు ఎల్దాంరా.. నానెప్పుడు యాత్రలకు ఎల్లినా తీసుకెళ్లే బాబే మల్లీ బస్సేత్తనాడంట... అటునుంచటు దాచ్ఛారామం, సిమ్మాచలం చూసుకొని తిరిగొచ్చేద్దాం.. మళ్లీ ఎప్పుడు పుష్కరాలు వత్తాయిరా.. అమ్మి, నువ్వు, పిల్లలు కూడా బయలుదేరండ్రా’ ఆంటూ తమ వీధిలోని వాళ్లనందరినీ తొందరపెట్టిన ఆ వృద్ధురాలు అంత తొందరగానూ కన్నుమూశారు. రాజమండ్రి ఘటనలో మరణించిన ఆమె పేరు అమలాపురం పైడితల్లి. బాడంగి మండలం పాల్తేరు గ్రామానికి చెందినవారు. నలుగురు పిల్లలతో కలిసి ఒకే ఇంటిలో ఉంటున్న పైడితల్లితోపాటు కొడుకు, కోడలు, మనుమరాళ్లు కూడా వెళ్లారు.
పాల్తేరుకు సమీపంలో ఉన్న అలజంగి గ్రామానికి చెందిన కాంట్రాక్టరు కర్రి జగదీష్ మూడు రోజుల యాత్రకు ఒక్కొక్కరికి 1300 రూపాయలు టిక్కెట్టు అనేసరికి కుమ్మరి కులానికి చెందిన దాదాపు 15 కుటుంబాలవారు పిల్లాపాపలతో పయనమయ్యారు. గతంలో జగదీష్ వేసిన బస్సుల్లో కాశీ, తిరుపతి తదితర పుణ్యక్షేత్రాలకు వెళ్లిన పైడితల్లితోపాటు రెండో కొడుకు రమణ, కోడలు లక్ష్మి, మనమరాళ్లు కాంచన, లీల కూడా ఉన్నారు. పైడితల్లి ఇంటి పక్కనే ఉంటున్న 70 ఏళ్ల పూడి పారమ్మ కూడా వీరితోపాటు బయలుదే రారు. సోమవారం సాయంత్రం 43 మంది పాల్తేరు నుంచి బయలుదేరారు. కొత్తవలస వద్ద ఆగి పుళిహోర తిన్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు రాజమండ్రి లాలా చెరువు వద్దకు బస్సు చేరింది. అక్కడ నుంచి ఉచిత బస్సులో పుష్కరఘాట్కు వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో పైడితల్లి అసువులు బాశారు.
మృత్యువుతో ఇద్దరి పోరాటం
తొక్కిసలాటలో గాయపడి కోమాలోకి వెళ్లిన పారమ్మ, పొట్నూరు గంగమ్మ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. వీరిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారని గ్రామానికి చెందిన అమలాపురం కృష్ణ విలేకరులతో చెప్పారు. గాయపడిన అమలాపురం నాగమ్మ, పోలి పోలమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే గ్రామానికి చెందిన దంపతులు అంబటి అప్పారావు, సుభద్ర గల్లంతు అవడం, వారి గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవటం, ఫోన్ చేస్తున్నా స్పందించకపోవటంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి టీవీ చూసి తెలుసుకున్నాం
మా అమ్మ చనిపోయినట్లు సాక్షి టీవీ ద్వారా తెలిసింది. నిన్న ఇక్కడ నుంచి వెళ్లాక ఎవరూ ఫోను చేయలేదు. ఉదయం 9 గంటలకు అన్నయ్య ఇంటికి ఫోన్ చేసి అమ్మకు బాగోలేదు. ఆస్పత్త్రికి తీసుకెళ్తున్నామన్నారు. అప్పటికే సాక్షి టీవీలో తొక్కిసలాట, చనిపోయిన వారిని చూపిస్తుండడంతో అనుమానం వచ్చి మళ్లీ ఫోన్ చేస్తే నిజమేనని చెప్పారు.
-రామారావు, మృతురాలు పైడితల్లి కొడుకు, పాల్తేరు
వద్దంటే వెళ్లింది..
ఈ వయసులో యాత్రలు వద్దన్నా వినకుండా వెళ్లింది. తనకు వస్తున్న పింఛను డబ్బు దాచుకుని బయలుదేరింది. వీధి వారంతా ఉన్నారు కదా ఏమీ అవదనుకున్నాం. ఆస్పత్రిలో అమ్మ ఎలాగుందో.. ఏమిటో..
-సింహాచలం, పారమ్మ రెండో కొడుకు, పాల్తేరు
సత్యవతి ఇంటి వద్ద అలముకున్న విషాదం
విజయనగరం క్రైం: రాజమండ్రి ఘటనలో పట్టణంలోని కోరాడవీధికి చెందిన కోచ్చెర్లపాటి సత్యవతి (62) మృతిచెందడంతో ఇంటివద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. సత్యవతి కోరాడ వీధిలో అద్దెకు నివాసం ఉంటున్నారు. భర్త అప్పలరాజు మృతి చెందడంతో పిల్లల బాధ్యతను చూసుకుంటున్నారు. ఈ ప్రాంతం నుంచి 40 మంది నాలుగు వాహనాల్లో సోమవారం రాత్రి బయల్దేరి వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో సత్యవతి మరణించారు. ఈ విషయాన్ని తోటివారు ఆమె కుమారుడు రవికుమార్రాజుకు తెలియజేశారు. రాజు చిన్నపాటి ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ మరణించటంతో ఒంటరిగా మిగిలిపోయారు. రవికుమార్రాజుకు చెల్లి శ్రీలత ఉంది. ఆమెకు వివాహం చేశారు. రవికుమార్రాజుకు ఇంకా పెళ్లికాలేదు. అతని పెళ్లి చూడకుండానే తల్లి మృత్యువాత పడడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెవెన్యూ అధికారులు వివరాలు సేకరించారు. సత్యవతి మృతదేహాన్ని తీసుకొస్తున్నామని బంధువులు తెలిపారు.
నివ్వెరపోయిన అవ్వపేట
భోగాపురం: మండలంలోని సవరవిల్లి పంచాయతీ అవ్వపేట గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు బంగారమ్మ, గౌరిలు రాజమండ్రి పుష్కరఘాట్లో జరిగిన తొక్కిసటలో మరణించటంతో గ్రామస్తులు నివ్వెరపోయారు. అవ్వపేట గ్రామానికి చెందిన అవ్వ కృష్ణ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. విశాఖపట్నం మారికవలసలోని రాజీవ్ గృహకల్పలో ఇల్లు మంజూరవడంతో భార్య పిల్లలతో సహా అక్కడే ఉంటున్నారు. గోదావరి పుష్కరాలకు భార్య బంగారమ్మ (35), కుమార్తె గౌరి(14), కుమారుడు రాంబాబుతో కలిసి సోమవారం వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో బంగారమ్మ, కుమార్తె గౌరి మరణించారు. విషయం తెలియగానే గ్రామంలో విషాదం అలముకుంది. ఏఎంసీ మాజీ చైర్మన్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, సర్పంచ్ పట్న రామనర్సయ్యమ్మ, ఎంపీటీసీ సభ్యుడు పట్నతాతయ్య తదితరులు కృష్ణ కుటుంబానికి సంతాపం తెలిపారు. మృతదేహాలను బుధవారం గ్రామానికి తీసుకురానున్నారు.