breaking news
Krishna - Godavari
-
రాష్ట్రం కన్నా స్వలాభమే మిన్నా?
కృష్ణా, గోదావరి, వంశధార నదీ జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కన్నా స్వప్రయోజనాలే తనకు ప్రధానమని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తనకు తానుగానే చాటుకుంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకమే అందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి 3న ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వాటిని చంద్రబాబు ఖండించకపోగా... రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదంటూ తెగేసి చెప్పడం ద్వారా రేవంత్ చేసిన వ్యాఖ్యలను బలపరిచారు. రేవంత్తో కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేయడంపై రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఎత్తిపోతల పూర్తయితే ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందే ఉండదు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. ఆ ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల వద్ద అమర్చారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయాలి. వాటికి 101 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ఆ ప్రాజెక్టుల కింద 10.33 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రస్తుత డిజైన్ ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిపోయాయి. 881 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉండే రోజులు బాగా తగ్గాయి. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కులు... 841 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి ఆస్కారం ఉంటుంది. అంత కంటే నీటిమట్టం తగ్గితే... ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు ఉన్నా సరే పోతిరెడ్డిపాడు ద్వారా ఆయకట్టుకు నీళ్లందించడానికి ఆస్కారం ఉండదు.వాటా జలాలను వాడుకోవడానికే...కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరకముందే జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తెలంగాణ సర్కార్ తరలిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 777 అడుగుల నుంచి 825 అడుగుల నీటిమట్టం లోపే కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి,డిండి ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 7 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. అంటే... జూరాల, శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి వినియోగం తొలి ప్రాధాన్యం తాగునీటికే! ఆ తర్వాత సాగునీరు!! శ్రీశైలం దిగువన సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు... అదీ కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు నీటిని మాత్రమే కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు తరలించవచ్చు. కానీ తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే... దిగువన నీటి అవసరాలు లేకున్నా సరే... శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం దిగువ నుంచే యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చి నట్టుగా తెలంగాణ సర్కార్ తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడుగులకు చేరడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వరద ప్రవాహం నిలిచిపోయాక కూడా తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా నీటిని తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడగులకు దిగువకు చేరుకుంటోంది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాటిని వాడుకోలేని దుఃస్థితి. 2014–19 మధ్య రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రస్థాయిలో నష్టపోవడమే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలగనివ్వకుండా... ఆంధ్రప్రదేశ్కు చట్టబద్ధంగా దక్కిన వాటా జలాలను వినియోగించుకోవడానికే 2020 మే 5న రూ.3,850 కోట్ల వ్యయంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఎత్తిపోతల రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ!శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ప్రధాన కాలువలోకి ఎత్తిపోసి... ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టులో పంటలను రక్షించడం... రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తి పోతలను చేపట్టి... పనులను పరుగులెత్తించారు. ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్కు రైతులు నీరాజనాలు పలుకుతారని గ్రహించిన చంద్రబాబు... మహబూబ్నగర్ జిల్లాలోని టీడీపీ నేతలను ఉసిగొలిపి అక్కడి రైతుల ద్వారా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో కేసులు వేయించారు. సీమ ఎత్తిపోతల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఆ కేసులు వేయించారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయనీ... ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదనీ ఎన్జీటీలో వైఎస్సార్సీపీ సర్కార్ సమర్థ వంతంగా వాదనలు వినిపించింది. కానీ... పర్యావరణ అనుమతి తీసుకున్నాకే పనులు చేపట్టాలని 2020 అక్టోబర్ 29న ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే రాయలసీమ ఎత్తిపోతల పనులను వైఎస్సార్సీపీ సర్కార్ పరుగులు పెట్టించింది. మళ్లీ దీనిపై ఎన్జీటీలో చంద్రబాబు కేసులు వేయించారు. వాటిని ఎదుర్కొంటూనే... పర్యావరణ అను మతి కోసం ప్రయత్నిస్తూనే... తాగునీటి అవసరాల కోసం 58 టీఎంసీలను తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పనులను తొలుత పూర్తి చేయాలని 2023 ఆగస్టు 11న ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మే వరకూ పనులు జరిగాయి. వాటిని చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించిన ఎం–బుక్కులే అందుకు నిదర్శనం. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని గాలేరు– నగరి, హంద్రీ–నీవాను అనుసంధానం చేయడం ద్వారా తీసుకెళ్లి చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని హంద్రీ–నీవా రెండో దశ ఆయకట్టుకు అందించి... శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే 40 టీఎంసీలను కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆయకట్టుకు అందించాలన్నది వైసీపీ సర్కారు ఆలోచన. 2024 జూన్ 12న చంద్రబాబు మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రాయలసీమ ఎత్తిపోతల పనులను పూర్తి స్థాయిలో ఆపేశారు. దానికి ప్రధాన కారణం ఏమిటన్నది తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడూ విఘాతమే!ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో చంద్రబాబు తొలి సారిగా అధికార పీఠాన్ని అధిరోహించారు. 1996 లోక్సభ ఎన్నికల తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాననీ, అప్పటి కర్ణాటక సీఎం హెచ్డీ దేవెగౌడను తానే పీఎంను చేశాననీ చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకొంటారు. కానీ... అదే సమయంలో ఆనకట్టగా ఉన్న ఆల్మట్టిని కర్ణాటక రిజర్వాయర్గా మార్చేసి... దాని నీటి నిల్వ సామర్థ్యాన్ని 53 నుంచి 129 టీఎంసీలకు పెంచేసినా నోరు మెదపకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాలపై ఉన్న హక్కులను కర్ణాటకకు చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఆల్మట్టి సామర్థ్యం పెంచడం వల్ల శ్రీశైలానికి జూన్ నెలా ఖరుకు రావాల్సిన వరద జూలై చివరకు... ఆగస్టు మొదటి వారానికి గానీ రావడం లేదు. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇక బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కాలపరిధి 2000తో ముగు స్తుందనీ, కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ వేస్తారనీ, ఆంధ్ర ప్రాంతంలో వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగా ణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ వంటి ప్రాజెక్టులను చేపడితే వాటికి నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ చేస్తుందనీ అప్పటి సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు, సాగునీటిరంగ నిపు ణులు అనేక మార్లు విఙ్ఞప్తులు చేశారు. కానీ వాటిని పట్టించుకోలేదు. అప్పట్లో వాటిని చేపట్టి ఉంటే... తెలుగు గంగకు 25 టీఎంసీలు కేటాయించినట్లే ఆ ప్రాజెక్టులకు కూడా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసేది.పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజే!గోదావరి ట్రిబ్యునల్ అవార్డు అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠ నీటిమట్టంతో పోలవరం ప్రాజెక్టును 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆ స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 2021 జూన్ 11 నాటికే స్పిల్ వేను అప్పటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. కానీ 2024 ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,157 కోట్లను మాత్రమే ఆంధప్రదేశ్ సర్కార్కు విడుదల చేయాలని కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ కేబినెట్ సమావేశంలో ఉన్న టీడీపీ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. చంద్రబాబు సర్కార్ కూడా దానిపై అభ్యంతరం చెప్పలేదు. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. 41.15 మీటర్ల ఎత్తు వరకు కేవలం 119.4 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయవచ్చు. ఇక 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే... పోలవరం కుడి, ఎడమ కాలువ కింద 7 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించడానికి వీలుంటుందని సాక్షాత్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీనే స్పష్టం చేస్తోంది. పోలవరం రిజర్వా యర్ను బ్యారేజ్గా మార్చేయడం వల్ల కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 63 టీఎంసీలను వెనుకబడిన ఉత్తరాంధ్రకు మళ్లించడానికీ ఆస్కారం ఉండదు. జీవనాడి పోలవరంలో జీవం తీసేసి రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించిన ఘనత బాబుకే దక్కుతుంది. ఇక వంశధార జలాలపై రాష్ట్ర హక్కులను వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను 2004 దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టి పరిరక్షించారు. ఆ ప్రాజెక్టు వల్లే వంశధారలో 75 శాతం నీటి లభ్యతగా ఉన్న 115 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరి సగం పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆ బ్యారేజీ నిర్మాణం కోసం 2021 నవంబర్ 9న నాటి సీఎం వైఎస్ జగన్ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అప్పటి ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలు జరిపారు. నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం సంప్రదింపులు జరుపుతూనే... వంశధార జలాలను పూర్తి స్థాయిలో వాడుకుని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించేందుకు హీరమండలం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 40 శాతం పనులు పూర్తి చేశారు. కానీ... 2024 జూన్ 12 తర్వాత ఆ ఎత్తిపోతల పనులను చంద్రబాబు సర్కార్ ఆపేయడం ద్వారా వంశధార ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం చేసింది.– ఆర్.జి.ఆర్. -
కావేరికి గోదారి.. ఏపీ అవసరాలను తీర్చాకే
సాక్షి, అమరావతి: ఏపీ అవసరాలు తీర్చాకే కావేరి పరీవాహక ప్రాంతానికి గోదావరి జలాలను తరలించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) పాలక మండలి సమావేశంలో గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి అనుసంధానంపై ప్రధానంగా చర్చించారు. బేసిన్ పరిధిలోని రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఏపీ తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. సహకరించాలన్న జల్శక్తి శాఖ కార్యదర్శి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247.19 టీఎంసీలను నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా) మీదుగా కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించే పనులు చేపట్టడానికి సహకరించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ కోరారు. దీనిపై ఛత్తీస్గఢ్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమకు కేటాయించిన 147.9 టీఎంసీలను కావేరికి తరలించడానికి అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనలో ఎస్సారెస్పీ(శ్రీరాంసాగర్ ప్రాజెక్టు)–ఇచ్చంపల్లి మధ్య 176.6 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్క కట్టిందని, కానీ వాటిని ఉపయోగించుకునేలా ఇప్పటికే ప్రాజెక్టులు చేపట్టామని, అంటే అక్కడ ఇక నీటి లభ్యత ఉండదని తెలంగాణ స్పష్టం చేసింది. మహానది–గోదావరి అనుసంధానం చేపట్టాకనే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని పేర్కొంది. సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చడాన్ని అంగీకరించబోమంది. అదనపు వాటా కోసం పట్టు.. గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా కృష్ణా బేసిన్కు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కర్ణాటక డిమాండ్ చేసింది. కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కేరళ కోరింది. గోదావరి–కావేరి అనుసంధానాన్ని పూర్తి చేసి తమ రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని తమిళనాడు విజ్ఞప్తి చేసింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నాక గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని పంకజ్కుమార్ తెలిపారు. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్ను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏపీ ఏం చెప్పిందంటే.. ► గోదావరిలో నీటి లభ్యతపై ఎన్డబ్ల్యూడీఏ, కేంద్ర జలసంఘం వేర్వేరుగా లెక్కలు చెబుతున్నాయి. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరి నికర జలాల్లో మిగులు లేదు. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలి. గోదావరి డెల్టాకు ఖరీఫ్కు నీళ్లు అవసరం. అందువల్ల జూన్లో కావేరికి గోదావరిని తరలించరాదు. ► ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే 776 టీఎంసీలు అవసరం. దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి గోదావరి–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) అనుసంధానం చేపట్టాలని నిర్ణయించాం. ఈ ప్రతిపాదన మేరకు గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గోదావరి జలాలు చేరేలా అనుసంధానం చేపట్టాలి. బొల్లాపల్లి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నిర్మిస్తేనే అనుసంధానం ఫలవంతమవుతుంది. -
‘గెజిట్’పై ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న విషయమై ఇరిగేషన్ శాఖ తీవ్ర మంతనాలు జరుపుతోంది. రాష్ట్ర ప్రాజెక్టులపై పడే ప్రభావం, బోర్డుకు కొత్తగా సంక్రమించే హక్కులు తదితరాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో సోమవారం ఈ అంశంపై ప్రత్యేక సమావేశం జరపనుంది. ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రతజ్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ఈఎన్సీలతోపాటు అంతర్రాష్ట్ర జల విభాగ ఇంజనీర్లు, ఇతర న్యాయ నిపుణులు హాజరయ్యే అవకాశం ఉంది. గెజిట్తో రాష్ట్రానికి జరిగిన న్యాయాన్యాయాలు, తెలంగాణ భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుతెన్నులు, న్యాయ పోరాటం, కొత్త ట్రిబ్యునల్ కోసం తేవాల్సిన ఒత్తిడి వంటి అంశాల గురించి ఈ భేటీలో చర్చించనున్నారు. న్యాయ పోరాటమా.. కొత్త ట్రిబ్యునలా? కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలో ఉంచడాన్ని తెలంగాణ తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు లేకుండా బోర్డుల పరిధిని నిర్ణయించరాదని కోరినా కేంద్రం మాత్రం వాటి పరిధిని నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాలు బోర్డుల పరిధిని నోటిఫై చేసేందుకు సమ్మతించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో గెజిట్పై సుప్రీంకోర్టుకు వెళ్లే విషయమై రాష్ట్రం తర్జనభర్జన పడుతోంది. సుప్రీంకు వెళ్లినా రాష్ట్రానికి పెద్దగా ఉపశమనం ఉండదనే భావన ప్రభుత్వ పెద్దల నుంచి వస్తోంది. గెజిట్పై కొట్లాడటంకన్నా కొత్త ట్రిబ్యునల్ చేత విచారణ జరిపించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే రాష్ట్రానికి నదీ జలాల్లో వాటాలు పెరుగుతాయని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని కేంద్ర మంత్రి స్వయంగా అపెక్స్ భేటీలో చెప్పిన నేపథ్యంలో కేంద్రం తన మాటకు కట్టుబడి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఉండాలనే సూచనలు వస్తున్నాయి. కొత్త ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో విచారణ జరిగితే పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల్లో తెలంగాణ కనీసం 500 టీఎంసీల వరకు నీటి వాటా దక్కించుకునే అవకాశం ఉంటుందని, వరద జలాల ఆధారంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు నికర జలాల లభ్యత పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై సోమవారం భేటీలో ఇంజనీర్ల సలహాలు తీసుకొని న్యాయపోరాటం చేయాలా లేక రాష్ట్ర వాటాలు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంతో ముందుకెళ్లాలా అనే విషయమై ఓ నిర్ణయానికి రానుంది. ప్రాజెక్టుల పనుల నిలుపుదలపై తర్జనభర్జన కేంద్రం తన నోటిఫికేషన్లో అనుమతులు లేని ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించడంతోపాటు నోటిఫికేషన్ వెలువడిన ఆరు నెలల్లోగా ఆయా ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను బోర్డులకు సమర్పించి, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం గెజిట్లో ప్రచురించిన తెలంగాణ ప్రాజెక్టుల పనులు నిలిపివేయడం, అనుమతుల ప్రక్రియ వేగిరం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. అనుమతుల్లేవని కేంద్రం చెబుతున్న తెలంగాణ ప్రాజెక్టుల్లో కృష్ణా బేసిన్ పరిధిలో పాలమూరు–రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, ఎస్ఎల్బీసీకి అదనంగా 10 టీఎంసీల తరలింపు, కల్వకుర్తి, కల్వకుర్తికి అదనంగా 10 టీఎంసీల తరలింపు, డిండి, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల, భక్త రామదాస, తుమ్మిళ్ల, నెట్టెంపాడు, నెట్టెంపాడు ద్వారా అదనంగా 3.40 టీఎంసీ తరలింపు, దుబ్బవాగు, సీతారామ మూడో పంప్హౌస్, మున్నేరులు ఉండగా గోదావరి బేసిన్లోవి కంతనపల్లి బ్యారేజీ, కాళేశ్వరం ద్వారా అదనపు టీఎంసీ మళ్లింపు, రామప్ప–పాకాల, ప్రాణహిత, గూడెం ఎత్తిపోతల, చిన్న కాళేశ్వరం, చౌట్పల్లి హమ్మంత్రెడ్డి ఎత్తిపోతల, కందుకుర్తి ఎత్తిపోతల, సీతారామ, మోదికుంటవాగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిపై ఎలా నడుచుకోవాలన్న విషయమై ఇంజనీర్ల నుంచి స్పష్టత తీసుకోనుంది. అలాగే ప్రాజెక్టుల పర్యావరణ, అటవీ అనుమతుల ప్రక్రియను వేగిరం చేసే అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి. -
కృష్ణా, గోదావరి వరదలపై కీలక సమావేశం..కృష్ణా బోర్డు భేటీ వాయిదా!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో దిగువ రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ (కేజీబీవో) మంగళవారం కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బేసిన్ పరిధిలోని రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేజీబీవో సీఈ డి.రంగారెడ్డి వర్చువల్ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సీజన్లో కృష్ణా, గోదావరి నదులకు వరద వచ్చే సమయంలో.. వరద ముప్పును తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎగువ రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా బేసిన్లోని జలాశయాల్లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరాకగానీ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయడం లేదు. గరిష్టంగా వరదను ఒకేసారి విడుదల చేయడం వల్ల దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద బారిన పడుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటున్న ఏపీ, తెలంగాణ.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని నదీ బేసిన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వరద సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలు, దిగువ రాష్ట్రాలతో సమాచార మార్పిడి తదితర అంశాలపై ఆయా రాష్ట్రాలకు మార్గదర్శనం చేయనున్నారు. కృష్ణా బోర్డు భేటీ వాయిదా సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపకాలపై చర్చించేందుకు మంగళవారం జరగాల్సిన కృష్ణా బోర్డు భేటీ వాయిదా పడింది. యాస్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉంటుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జల వనరుల శాఖ అధికారులంతా దానిని ఎదు ర్కొనే కార్యాచరణలో నిమగ్నమై ఉన్నారు. దీనికితోడు కేంద్రం ఆదేశాల మేరకు పోల వరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై అధికార యంత్రాంగం ఉన్నందున మంగళవారం నాటి భేటీని వాయిదావేయాలని ఆంధ్రప్రదేశ్ బోర్డును కోరింది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. -
ఇచ్చంపల్లికే మొగ్గు !
సాక్షి, హైదరాబాద్ : నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా గోదావరి నుంచి కృష్ణా జలాలను కావేరీకి తరలించే క్రమంలో ఇచ్చంపల్లి నుంచే నీటి తరలింపునకు కేంద్రం మొగ్గుచూపుతోంది. ఇప్పటికే కేంద్ర జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన అకినేపల్లి ప్రతిపాదనను, జనంపేట నుంచి పైప్లైన్ ద్వారా నీటి తరలింపు ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించడంతో ఇచ్చంపల్లి నుంచి నీటిని నాగార్జునసాగర్కు తరలించే ప్రతిపాదనకు పదును పెడుతోంది. అనుసంధాన ప్రక్రియపై ఈ నెల 21న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇచ్చంపల్లి నుంచి నీటి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చిన ఎన్డబ్ల్యూడీఏ.. దీనిపై తెలంగాణ అభిప్రాయాలు కోరింది. నిజానికి ఎన్డబ్ల్యూడీఏ మొదట 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరీకి తరలించాలని మొదట ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలపడంతో జనంపేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూసేకరణ తగ్గించేలా పైప్లైన్ ద్వారా నాగార్జునసాగర్కు తరలించాలని ప్రతిపాదించింది. అయితే పైప్లైన్ ద్వారా నీటిని తరలిస్తే వ్యయం ఏకంగా రూ.90 వేల కోట్ల మేర ఉంటోంది. కాల్వల ద్వారా అయితే రూ.60 వేల కోట్ల వరకే వ్యయం ఉంటోంది. అయినా ఈ ప్రతిపాదనతో పెద్దగా ఉపయోగం లేకపోవడంతో తెలంగాణ తిరస్కరించింది. దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇచ్చంపల్లి (గోదావరి)– నాగార్జునసాగర్ (కృష్ణా) ప్రాజెక్టులను అనుసంధానించాలని, దీనికి మూసీ రిజర్వాయర్ను వినియోగించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి తెలంగాణ సానుకూలంగా ఉంది. ఈ అనుసంధానం ద్వారా ఎస్సారెస్పీ–2లోని కాకతీయ కాల్వల ఆయకట్టు, ఎస్ఎల్బీసీ ఆయకట్టు, డిండి ఆయకట్టుకు కలిపి మొత్తం 9 లక్షల హెక్టార్లు (25 లక్షల ఎకరాలు) ఆయకట్టుకు నీరు అందించొచ్చని కేంద్రం చెబుతోంది. దీనికి రూ.73 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణను కోరింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి నీటిని కృష్ణాకు తరలించే అంశమై చర్చలు జరుగుతున్న దృష్ట్యా, దీనిపై ఓ స్పష్టత వచ్చాక కేంద్రం చేస్తున్న ప్రతిపాదనపై స్పష్టత ఇస్తామని తెలంగాణ తెలిపింది. -
నీటి పంచాయతీపై చలో ఢిల్లీ!
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై మరోమారు చర్చలకు కేంద్రం సిద్ధమైంది. ఏడాది కిందట ఈ బోర్డులతో చర్చించిన పిదప మరెలాంటి చర్చలు చేయని కేంద్రం, తొలి సారి రెండు నదీ యాజమాన్య బోర్డుల చైర్మన్లు, కార్యదర్శులతో సమావేశం జరిపేందుకు సమాయత్త మైంది. ఈ నెల 13న ఢిల్లీలో బోర్డులతో భేటీ నిర్వ హిస్తామని కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు కేంద్ర జల వనరుల శాఖ లేఖలు రాసింది. కృష్ణా, గోదావరి నదీ జలాల పరిధిలో నెలకొన్న వివాదా లతో పాటు, పోలవరం పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న అంశాలపై అన్న నివేదికలతో రావాలని కేంద్రం బోర్డుల చైర్మన్లను ఆదేశించింది. బోర్డు పరిధి, కొత్త ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఐదేళ్లుగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నియంత్రణ, నీటి కేటాయింపుల్లో వాటాలు, కొత్త ప్రాజెక్టులపై వివాదం కొనసాగు తోంది. తెలంగాణ ఇటీవలే వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం వంటి ఎత్తిపోతల పథకాలు చేప ట్టిందని ఏపీ బోర్డులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటే బోర్డుల పరిధి, వర్కిం గ్ మ్యాన్యువల్ను ఆమోదిం చాల్సి ఉంది. దీనిపై తెలంగాణ అనేక అభ్యంతరాలు చెబుతోంది. కృష్ణాలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటా యింపులే లేనప్పుడు, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం ఎందుకని తెలంగాణ ప్రశ్నిస్తోంది. నిర్ణీత కేటా యింపుల్లోంచే వాటా నీటిని వాడుకుంటు న్నామని చెబుతోంది. దీంతో బోర్డు మ్యాన్యు వల్కు ఆమోదం దక్కడం లేదు. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటే ఇంతవరకు జరగలేదు. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలపై చర్చిద్దామని కేంద్రం బోర్డులకు స్పష్టం చేసింది. మళ్లింపు వాటా, ముంపు తీవ్రత ప్రధానం.. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏపీ చేపట్టిన పోలవరం ద్వారా తెలంగాణకు 45 టీఎంసీలు, ఇదే అవార్డు ప్రకారం పోలవరం కాకుండా ఇంకా ఏదైనా ప్రాజెక్టు (పట్టిసీమ) ద్వారా గోదావరి నుంచి కృష్ణా కు నీటిని తరలిస్తే అంతే పరిమాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతూ మొత్తంగా 90 టీఎంసీ లు తమకు దక్కుతాయని తెలంగాణ అంటోంది. ఈ నీటిని కృష్ణాలో ప్రస్తుతం ఉన్న 299 టీఎంసీల వాటాకు జోడించాలని కోరుతోంది. దీనిపై బోర్డుల వద్ద చర్చ జరిగినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ వాటాలకోసం ఇటీవల తెలంగాణ.. బోర్డుపై ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షతన 13న ఢిల్లీలోని శ్రమశక్తిభవన్లో రెండు బోర్డుల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. -
కృష్ణా, గోదావరిపై కొత్త ప్రాజెక్టులు: కేసీఆర్
హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదులపై కొత్తగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తామని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. వ్యవసాయరంగం, వర్షాభావ పరిస్థితులపై ఉన్నతాధికారులతో కేసీఆర్ మంగళవారం సమీక్ష జరిపారు. రాష్ట్రంలో వ్యవసాయరంగానికి పూర్వవైభవం తేవాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులతో తెలంగాణ వ్యాప్తంగా సాగునీరు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూరగాయల సాగు గణనీయంగా పెరగాల్సిన అవసరమందని ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
అనుసంధానమే శరణ్యం
ట్రిబ్యునల్ తీర్పుతో మరో గత్యంతరం లేని పరిస్థితి పోలవరం, దుమ్ముగూడెం-సాగర్ టెయిల్పాండే గతి ఈ విషయాన్ని గతంలోనే గుర్తించిన వైఎస్ కానీ వాటి నిర్మాణంపై మీనమేషాలు లెక్కిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం టెండర్ల స్థాయిలోనే పోలవరం, బుట్టదాఖలైన దుమ్ముగూడెం సాక్షి, హైదరాబాద్: కృష్ణా-గోదావరి అనుసంధానం అవసరం ఎంతగా ఉందో బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుతో మరోసారి స్పష్టమైంది. ప్రస్తుతం గోదావరి నుంచి నీటిని తరలిస్తేనే కృష్ణా ఆయకట్టు రైతులు మనుగడ సాగించే పరిస్థితి నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విషయాన్ని గతంలోనే గుర్తించారు. అందులో భాగంగానే పోలవరం, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్టులకు ఆయన ప్రాణం పోశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వాటి నిర్మాణం విషయంలో అంతులేని అలసత్వం ప్రదర్శిస్తోంది. ఆ రెండు ప్రాజెక్టుల నిర్మాణమే కీలకం: బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కారణంగా మనకు రావాల్సిన నీటి కోటా గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాభావ కాలంలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టాలపై ఆధారపడ్డ ఆయకట్టు తీవ్రంగా దెబ్బతిన డం ఖాయం. దీన్ని తట్టుకోవాలంటే పోలవరం, దుమ్ముగూడెం-సాగర్ టెయిల్పాండ్లను చేపట్టాలి. పోలవరం నిర్మిస్తే.. ఆ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 80 టీఎంసీల నీరు కృష్ణా బేసిన్లోకి వస్తుంది. వీటిలో 35 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు పోయినా, మిగతా 45 టీఎంసీలతో డెల్టా ఆయకట్టును కాపాడుకోవచ్చు. పైగా దుమ్ముగూడెం-సాగర్ టెయిల్పాండ్ ద్వారా ఖమ్మం జిల్లా పరిధి నుంచి 165 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్లోని సాగర్ దిగువకు తరలించడానికి అవకాశం ఉంది. ఈ నీటితో సాగర్ ఆయకట్టు అవసరాలను తీర్చవచ్చు. ఆ మేరకు కృష్ణాలో మిగిలే నీటిని ఇటు నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల అవసరాలకే గాక కరువును ఎదుర్కొనే రాయలసీమ అవసరాలకు కూడా వాడుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ రెండు ప్రాజెక్టులను నిర్మించడంలో అంతులేని అలసత్వం ప్రదర్శిస్తోంది. పోలవరం టెండర్లను ఖరారు చేసినా అనేక వివాదాల వల్ల పనులు మాత్రం జరగడం లేదు. ఇక దుమ్ముగూడెం-సాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్టునైతే పూర్తిగా పక్కన పెట్టారు. వైఎస్ మరణానంతరం ఆ ప్రాజెక్టును పట్టించుకోవడమే లేదు. అనధికారికంగా ఆ ప్రాజెక్టును రద్దు చేశారనే చెప్పాలి!


