ఉత్తమ సేవకులకు అవార్డుల ప్రదానం
గంగావతి, న్యూస్లైన్ : వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు చేసిన పలువురిని చెన్న బసవ స్వామి ప్రకాశన సంస్థ ఘనంగా సత్కరించడం శ్లాఘనీయమని అరలహళ్లి బృహన్మఠం స్వామి రేవణ సిద్దయ్య తాత కొనియాడారు. ఆయన ఆదివారం నగరంలోని ఐఎంఐ హాల్లో శ్రీ చెన్నబసవ స్వామి సంస్థ, కళ్యాణ శ్రీ కన్నడ పత్రిక సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి వ్యక్తి నిత్యం క్రియాశీలురై జన్మను సార్దకత చేసుకునే దిశగా పయనించాలన్నారు. కళా సాహిత్య, సంగీత, సాంస్కృతిక, జానపద కళలను పెంపొందించేందుకు శ్రమించే వారిని గుర్తించి త్రికాల జ్ఞాని శ్రీ చెన్నబసవస్వామి గుర్తించి గౌరవించడం గొప్పతనమన్నారు.
రాబోయే రోజుల్లో ఇలాంటి రాష్ట్రస్థాయి అవార్డులను పలు రంగాల వారికి అందించేందుకు ప్రోత్సాహాన్ని అందించాలని స్వామీజీ కోరారు. ఈ కార్యక్రమంలో క వి, సాహితీవేత్త శరణప్ప మేటి, జీ.శివలింగప్ప, లక్ష్మీదేవి పత్తార్, విరుపాక్షప్ప శిరవార, కళ్యాణశ్రీ పత్రిక సంపాదకులు హెచ్ మల్లికార్జున, శ్రీచెన్నబసవస్వామి ప్రకాశన సంస్థ అధ్యక్షులు ఎం.పరుశురాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగ స్థల క్షేత్రంలో ఉత్తమ సాధకులు రేవణసిద్ధయ్య, చిదానంద నీరగంటి, ఆధ్యాత్మిక సంగీత సాధకులు గణేశ్వర స్వామి, సాహితీవేత్తలు శివకుమార్ మాలి పాటిల్, రంగస్థల సమాజ సేవకులు ఎస్పీ అమరాల్, పత్రికారంగం నుంచి ఎస్ఎన్ పాటిల్, విద్యా రంగానికి చెందిన ఎన్.పుష్పావతి తిరుపాలయ్య, హనుమంతప్ప గిడ్డి, బయలాట కళాకారులు మారుతీ, తదితరులను ఘనంగా సన్మానించారు.