కశ్మీర్పై మీ జోక్యం అనవసరం
పాక్కు భారత్ హెచ్చరిక
న్యూఢిల్లీ: కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, వెంటనే జోక్యం చేసుకొని అక్కడ ఐక్యరాజ్యసమితి తీర్మానాలు అమలు చేయాలంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాయడంపై భారత్ మండిపడింది. కశ్మీర్ భారత్ అంతర్గత విషయమని, ఇందులో జోక్యం చేసుకోవద్దని పాక్ను హెచ్చరించింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చూపే ప్రయత్నాన్ని మానుకోవాలని స్పష్టం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని, చొరబాట్లు ఆపాలని పాక్కు గట్టి హెచ్చరికలు పంపింది.
ఈమేరకు గురువారం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తన భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించబోమంటూ చేసుకున్న ఒప్పందాలను పాక్ అతిక్రమిస్తోందన్నారు. మరోవైపు, కశ్మీర్లో భారత్ దురాగతాలకు పాల్పడుతోంద ని ఆరోపిస్తూ పాకిస్థాన్ అరబ్ దేశాల కూటమికి లేఖ రాసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వారిని కోరింది.