ప్రముఖ నటుడు మృతి
కొచ్చి: ప్రముఖ మలయాళ నటుడు జిష్ణు రాఘవన్ కన్నుమూశారు. కేన్సర్ తో బాధ పడుతున్న ఆయన శుక్రవారం ఉదయం 8.15 గంటలకు కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 35 ఏళ్ల జిష్ణు తన నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులతో ప్రఖ్యాతి గాంచారు. రెండేళ్ల క్రితం ఆయన కేన్సర్ బారిన పడ్డారు. చికిత్స తీసుకోవడంతో కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారని భావించారు. ఏడాది మళ్లీ కేన్సర్ తిరగబెట్టడంతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటూనే సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులు పెట్టేవారు.
ప్రముఖ నటుడు రాఘవన్ కుమారుడైన జిష్ణు 1987లో 'కిల్లిపట్టు' సినిమాతో బాలనటుడిగా నటజీవితం మొదలు పెట్టారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత హీరోగా తెరపైకి వచ్చారు. ఆయన మొదటి చిత్రం 'నమ్మాల్' ఘన విజయం సాధించింది. దీని తర్వాత నాలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆర్కిటెక్ ధన్యరాజన్ ను ఆయన వివాహం చేసుకున్నారు.
జిష్ణు రాఘవన్ మరణంతో మలయాళ సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఇటీవలే విలక్షణ నటుడు కళాభవన్ మణి అనుమానాస్పద పరిస్థితుల్లో హఠాన్మరణం చెందారు. కల్పన, షాన్ జాన్సన్, వీడీ రాజప్పన్, రాజేశ్ పిళ్లై తదితర నటులు ఈ ఏడాదిలోనే మరణించడంతో మలయాళ సినిమా పరిశ్రమకు వరుసగా షాక్ తగిలినట్టైంది.