బ్యాంక్ మిత్రా గోల్మాల్!
పుట్లూరు, న్యూస్లైన్ : మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెలా తాము తీసుకున్న రుణాలకు సంబంధించి కంతులు కడుతున్నా అవి బ్యాంకుల్లో జమకావడం లేదు. ఐకేపీ సిబ్బంది సహకారంతో బ్యాంక్ మిత్రా గోల్మాల్ చేసి వాటిని కాజేస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. స్వశక్తితో ఆర్థిక స్వావలంబన సాధిం చేందుకు మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం అందిస్తున్న పోత్రాహకాలను సద్వినియోగం చేసుకుం టూ వడ్డీ లేని రుణాలు పొంది వాటి కంతులను ప్రతి నెలా చెల్లిస్తున్నాయి. అయితే మండల పరిధిలోని అరకటివేములు, కొండాపురంలోని 12 సంఘాలకు సంబంధించిన దాదాపు రూ.3 లక్షలను బ్యాంక్ మిత్రా స్వాహా చేసింది. సభ్యులు ప్రతి నెలా చెల్లిస్తున్నా అవి బ్యాంకు ల్లో మాత్రం జమకావడం లేదు. కొండాపురం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద ఉన్న ఐకేపీ బ్యాంక్ మిత్రా కొంత కాలంగా సంఘాలు చెల్లిస్తున్న కంతులను కట్టకుండా స్వాహా చేసినట్లు తెలిసింది. అరకటివేములలో ని శ్రీలక్ష్మి, స్వయంశక్తి సంఘాలకు సంబంధించే రూ.1.25 లక్షలు స్వాహా అయినట్లు సమాచారం. బ్యాంక్ పరిధిలోని పలు సంఘాల డబ్బును కూడా స్వా హా చేసినట్లు అధికారుల అంతర్గత విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. దీంతో అక్రమాలకు పాల్పడిన బ్యాంక్ మిత్రా.. స్వాహా చేసిన డబ్బును తిరిగి చెల్లించేందుకు మధ్యవర్తుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
కాగా స్వాహా చేసిన మొత్తంలో ఐకేపీ సిబ్బందికి వాటా అందినట్లు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఐకేపీ ఏరియా కో ఆర్డినేటర్ నాగేంద్రను ‘న్యూస్లైన్’ సంప్రదించగా.. మహిళా సంఘాల డబ్బును కొండాపురం బ్యాంక్ మిత్రా స్వాహా చేసినట్లు తెలిసిందన్నారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. కొండాపురం ఏపీజీపీ మేనేజర్ ముత్యాలప్పను సంప్రదించగా.. అరకటివేముల గ్రామానికి చెందిన ఐకేపీ బ్యాంక్ మిత్రా తన బంధువులు ఉన్న సంఘాలకు సంబంధించి వారు చెల్లించిన మొత్తాలను తక్కువగా బ్యాంక్లో జమ చేస్తూ రసీదుల్లో అంకెలను మార్పు చేసి అవినీతికి పాల్పడిందన్నారు. స్వాహా చేసిన మొత్తం తిరిగి చెల్లిస్తానని చెప్పినట్లు తెలిపారు.