ఇవి లేకుంటే క్రిమినల్ కేసులే | If the criminal case | Sakshi
Sakshi News home page

ఇవి లేకుంటే క్రిమినల్ కేసులే

Jun 14 2014 2:03 AM | Updated on Sep 2 2017 8:45 AM

మీకు విద్యా, వ్యాపారసంస్థలు, గ్యాస్ గోడౌన్లు, పెట్రోల్ బంకులు, కుటీర, పెద్ద పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా.. ఉంటే వెంటనే అగ్ని ప్రమాద నివారణ పరికరాలను ఏర్పాటుచేసుకోవాలి.

 కడప అర్బన్ : మీకు విద్యా, వ్యాపారసంస్థలు, గ్యాస్ గోడౌన్లు, పెట్రోల్ బంకులు, కుటీర, పెద్ద పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా.. ఉంటే వెంటనే అగ్ని ప్రమాద నివారణ పరికరాలను ఏర్పాటుచేసుకోవాలి. అంతేకాక ఎన్‌ఓసీ సర్టిఫికెట్‌పొందాలి. ఈ సర్టిఫికెట్‌ను ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి. లేకుంటే క్రిమినల్ కేసులు తప్పవు.  ప్రొవిజినల్ సర్టిఫికెట్ తీసుకుని ఇంతవరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను తీసుకోని సంస్థలు జిల్లా వ్యాప్తంగా 187 ఉన్నాయి. వీరికి ఫైనల్ నోటీసులను అగ్నిమాపక శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ నోటీసులకు నెలలోపు స్పందించి ఎన్‌ఓసీకి దరఖాస్తు చేసుకోకపోతే కఠిన చర్యలను తీసుకోనున్నారు.
 
 ఎన్‌ఓసీకి దరఖాస్తు ఇలా..!
 వ్యాపార, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాళ్లవారు అగ్నిమాపక శాఖ అధికారుల చేత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) తీసుకోవాలి. వీటిల్లోనే రద్దీ నిరంతరం ఉంటుంది. మంటలను ఆర్పే గ్యాస్ సిలిండర్లు, ఇసుక బకెట్లు, ఆయా సంస్థ విస్తీర్ణతను అనుసరించి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో చదరపు అడుగుకు రూ.10 చొప్పున ఏ మేరకు విస్తీర్ణముందో అంత మొత్తాన్ని చలానా రూపంలో చెల్లించాలి. అగ్నిమాపక శాఖ అధికారులు పరిశీలించి ఎన్‌ఓసీ ఇస్తారు. ఈ సర్టిఫికేట్‌కు సంవత్సరం గడువు మాత్రమే ఉంటుంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ కోసం రూ.10వేల చలానా చెల్లించాలి.
 
 నోటీసులు సిద్ధం
 1998 వరకు ఎన్‌ఓసీ  సర్టిఫికెట్ తీసుకున్న వారు తర్వాత రెన్యువల్ చేయించుకోని కారణంగా 187 నోటీసులు సిద్ధం చేశారు. అంతేకాక 2007లో ప్రొవిజినల్ ఎన్‌ఓసీ తీసుకున్న వారు ఇప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోని కారణంగా వారికి కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. వీరందరూ ప్రస్తుతం ఎన్‌ఓసీ చేయించుకోవాలంటే ప్రతి సంవత్సరం వారి చలానా మొత్తానికి 24 శాతం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.
 
 స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి
 ఎన్‌ఓసీ తీసుకోవాలి
 జిల్లాలో నోటీసులు పొందిన సంస్థలతోపాటు ఇంకా ఎన్‌ఓసీ తీసుకోని వారు అగ్నిప్రమాద నివారణ పరికరాలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు స్వచ్ఛంధంగా దరఖాస్తు చేసుకుని ఎన్‌ఓసీ తీసుకోవాలి. ప్రొవిజినల్ ఎన్‌ఓసీ తీసుకుని ఆక్యుపెన్సీ తీసుకోకపోతే నేరమవుతుంది. ఎన్‌ఓసీ చేయించుకోవడంలో గానీ, రెన్యువల్ చేసుకోవడంలో గానీ నిర్లక్ష్యం వహిస్తే ఆ సంస్థకు రెండు నోటీసులు జారీ చేస్తాం. అప్పటికీ స్పందించకపోతే మూడవ నోటీసు ఇచ్చి నెల గడువు విధిస్తాం. తర్వాత సంస్థ గురించి డీజీకి ఫిర్యాదు చేస్తాం. అప్పటికీ స్పందించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం.
 - బి.వీరభద్రరావు,
 జిల్లా అగ్నిమాపక శాఖాధికారి, వైఎస్‌ఆర్ జిల్లా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement