
రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్
బి.కొత్తకోట : జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పని చేసిన సీసీ రోడ్లు, కూలీలకు రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరత్నం తెలిపారు. స్థానిక ఉపాధి కార్యాలయంలో ఆయన మంగళవారం ఫాం పాండ్స్ పనులపై క్షేత్ర, సాంకేతిక సహాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు నెలలుగా ఉపాధి ఎఫ్ఏ, టీఏలు, ఏపీఓలకు వేతనాలు అందలేదన్నారు. వీరికి త్వరలోనే వేతనాలు జమ అవుతాయని చెప్పారు. జిల్లాలో 11 వేల ఫాం పాండ్స్ నిర్మాణం కోసం పనులు చేపట్టగా.. ఇప్పటి దాకా 5,109ను రూ.25 కోట్ల వ్యయంతో పూర్తి చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 71 వేల మంది ఉపాధి పనులు చేస్తుండగా.. అందులో 26 వేల మంది ఫాం పాండ్స్ పనులు చేస్తున్నారని తెలిపారు. నెల రోజులుగా ఉపాధి పనులు చేసే కూలీల సంఖ్య పెరిగిందన్నారు. మండల ఉపాధి సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తూ.. మండలానికి 225 కంపోస్టు యార్డులు మంజూరైనట్టు చెప్పారు. ఈ నెలఖారులోగా 263 ఫాం పాండ్స్ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. 200 ఎకరాల్లో ఉద్యానవనాల పెంపకం లక్ష్యంగా నిర్ణయించామని, దీనిపై రైతులను గుర్తించి మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కూలీల సంఖ్యను 1,370కు పెంచాలని సూచించారు. యోగాంధ్ర యాప్లో ఉపాధి కూలీలను రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. సమావేశంలో ఏపీడీ నందకుమార్, ఏపీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయకుంటే చర్యలు
పెద్దతిప్పసముద్రం : ఉపాధి హామీ పథకంలో భాగంగా సిబ్బందికి నిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాలను నెలాఖరులోగా పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని డ్వామా పీడీ వెంకటరత్నం స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మండలంలోని క్షేత్ర, సాంకేతిక సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయన వెంట ములకలచెరువు క్లస్టర్ ఏపీడీ నందకుమార్రెడ్డి ఉన్నారు.
ఫాం పాండ్స్ పనులకు రూ.25 కోట్ల వ్యయం
పీడీ వెంకటరత్నం