గీత కార్మికుడికి గాయాలు
మోటకొండూర్ : తాటిచెట్టుపై నుంచి దిగుతుండగా జారిపడి కల్లుగీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మోటకొండూర్ మండల కేంద్రంలో సోమవారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన కల్లుగీత కార్మికుడు వంగాల చంద్రమౌళిగౌడ్ రోజుమాదిరిగానే తాటిచెట్టు ఎక్కి మెర వేసి కిందకు దిగుతుండగా.. ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. దీంతో ఆయన నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
దివిస్ ఉద్యోగి అదృశ్యం
చౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ పరిధిలోని దివిస్ ఫార్మా కంపెనీలో పనిచేసే ఉద్యోగి అదృశ్యమయ్యాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన బుద్దెపు ఏడుకొండలు కొంతకాలంగా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ పరిధిలోని దివిస్ పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తూ.. స్థానికంగా పరిశ్రమకు చెందిన హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 9వ తేదీ వరకు తల్లిదండ్రులకు ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడిన ఏడుకొండలు.. 10వ తేదీ నుంచి ఫోన్ చేయకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో తల్లిదండ్రులు పరిశ్రమ వద్దకు వచ్చి ఆరా తీశారు. దీంతో ఏడుకొండలు ఈ నెల 5వ తేదీ నుంచి హాస్టల్కు రావడం లేదని తోటి ఉద్యోగులు చెప్పారు. ఈ మేరకు సోమవారం ఏడుకొండలు తల్లి రమణమ్మ చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సిరెడ్డి తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణ శివారులోని దివ్యబాల పాఠశాల వద్ద సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పట్టణ ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. గుర్తుతెలియని వాహనం మృతుడి తలపై నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయ్యిందని పేర్కొన్నారు. డ్యూటీ కానిస్టేబుల్ సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడి వయస్సు 35 ఏళ్లు ఉంటాయని, గోధుమ రంగు చొక్కా, నీలం రంగు జీన్స్ ప్యాంట్ ధరించినట్లు వివరించారు.
కుక్కను తప్పించబోయి యువకుడి దుర్మరణం
భూదాన్పోచంపల్లి : రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి బైక్పై నుంచి పడి యువకుడు మృతిచెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పోచంపల్లి పట్టణ కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి పట్టణ కేంద్రంలోని లక్ష్మణ్నగర్ కాలనీకి చెందిన చేనేత కార్మికుడు పొట్టబత్తిని నర్సింహ చిన్న కుమారుడు సాయికుమార్(25) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి తన స్నేహితుడు దోర్నాల బద్రీనాథ్తో కలిసి పద్మానగర్ నుంచి బైక్పై ఇంటికి వస్తుండగా.. రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో దానిని తప్పించబోయి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సాయికుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న బద్రీనాథ్కు తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచార ఇవ్వడంతో వారు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా సాయికుమార్ అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బద్రీనాథ్ చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు సోమవారం ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గీత కార్మికుడికి గాయాలు


