ఆరోగ్యవంతమైన నారు పెంచండి ఇలా..
నడిగూడెం: ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే రబీ సాగుకు రైతులు నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. నారుమడి తయారాలో తగు జాగ్రత్తలు పాటించాలని నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ చెబుతున్నారు. ఆయన సలహాలు, సూచనలు..
ఫ నారుమడిని 10–12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా దమ్ముచేసి, చదును చేయాలి. నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేయాలి.
ఫ రెండు గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని (కిలో విత్తనం చల్లేముందు, మరో కిలో విత్తిన 12–14 రోజులకు), కిలో భాస్వరం, కిలో పొటాష్నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. చలి ఎక్కువగా ఉంటే భాస్వరం రెట్టింపుగా వేయాలి.
ఫ మొలక కట్టిన విత్తనాన్ని గుంటకు 12 కిలోల చొప్పున చల్లుకోవాలి.
ఫ నారు, ఒక ఆకు పురివిచ్చుకొనే వరకు ఆరు తడులు ఇచ్చి పలుచగా నీరు నిలకట్టాలి.
ఫ జింకు లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చలి ఎక్కువగా ఉంటే యాసంగి వరి సాగులో జింకు లోపం కనిపిస్తుంది.
ఫ విత్తిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాములు చొప్పున వేయాలి. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరుంచి వేయాలి.
చలి నుంచి నారుమడుల రక్షణ
రబీలో అధిక పంట దిగుబడులు సాధించడానికి చలిని తట్టుకునే అనువైన రకాలను ఎంపిక చేసుకోవాలి. ఎంపికతో పాటు ధృడమైన, ఆరోగ్యవంతమైన నారును పెంచడం అంతే ముఖ్యం. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినా, చలి తీవ్రత ఎక్కువైనా మొక్కలు సరిగ్గా ఎదగకపోవడం, ఆకులు పసుపు రంగుకి మారి కొన్నిసార్లు నారు చనిపోవడం జరుగుతుంది.
చలి నుంచి నారుమడిని రక్షించుకునే విధానం
ఫ చలి నుంచి నారు కాపాడుకోవడానికి రాత్రివేళ నారుమడిలో నీరు నిల్వ ఉంచకూడదు. ఎందుకంటే చల్లని నీటి వలన మొక్కలు చనిపోతాయి.
ఫ సాయంత్రం నీళ్లు తీసేసి మరల పగటిపూట కొత్త నీటిని పెడుతూ ఉండాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతి తప్పక పాటించాలి.
ఫ నారుమడిలో సేంద్రియ ఎరువులు వేయని రైతులు వర్మీ కంపోస్టు, గొర్రెలు, లేదా పశువుల ఎరువును పొడి రూపంలో చల్లుకోవాలి. దీని వల్ల నారు త్వరగా పెరుగుతుంది.
ఫ తీవ్రమైన చలి నుంచి రక్షించడానికి ఒక అడుగు ఎత్తులో వెదురు బద్దలు లేదా ఇనుప ఊచలు అమర్చి దాని మీద 2–3 ప్లాస్టిక్ షీట్లు లేదా రైతులు నూర్పిడికి వాడే పట్టాలు సాయంత్రం వేళ మొక్కలపై కప్పి మరల ఉదయం పూట తీసివేయాలి.
ఫ చలికాలంలో పోషకాలు మొక్కకు సరిగ్గా అందక కొన్నిసార్లు జింకు లోపం వలన ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడతాయి. లోప నివారణకు జింకు సల్ఫేట్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఫ కాండం తొలిచే పురుగు బారి నుంచి నారుమడిని కాపాడటానికి కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఎకరానికి సరిపడే నారుమడిని ఒక కిలో చొప్పున చల్లాలి. చలి తీవ్రత ఎక్కువై, మంచుతో కూడిన వాతావరణం ఉంటే అగ్గి తెగులు ఆశించకుండా మందు జాగ్రత్తగా ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఫ నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ సూచనలు
ఆరోగ్యవంతమైన నారు పెంచండి ఇలా..


