చినవెంకన్న హుండీ ఆదాయం రూ. 3.12 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గత 29 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ. 3,12,30,225 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 392 గ్రాముల బంగారం, 5.659 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ. 500, రూ. 2000 నోట్లు ద్వారా రూ. 26 వేలు వచ్చినట్టు చెప్పారు. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


