బధిరుల పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు
భీమవరం: విభిన్న ప్రతిభావంతుల ప్రతిభను గుర్తించి సరైన విధంగా శిక్షణనిస్తే వివిధ రంగాల్లో రాణిస్తారని భీమవరం ఒకటో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.హనీష అన్నారు. బుధవారం దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా భీమవరం పట్టణం బలుసుమూడిలోని శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో న్యాయ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలు, సాంస్కృతిక, ప్రభుత్వ రంగాల్లో నైపుణ్యానికి తగ్గ అవకాశాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విభిన్న ప్రతిభావంతులను వేధించినా, ధూషించినా శిక్ష తప్పదన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి న్యూటన్, ప్యానల్ న్యాయవాదులు పి.అంబేడ్కర్, ఎంబీ భవాని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: రాష్ట్ర స్థాయి కౌశల్ పోటీలకు జిల్లా నుంచి 12 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎంపికయ్యారని కౌశల్ జిల్లా కోఆర్డినేటర్ రేపాక వెంకన్నబాబు, జాయింట్ కోఆర్డినేటర్ జి శ్రీనివాసవర్మ బుధవారం తెలిపారు. 8వ తరగతికి చెందిన మీసాల ప్రశాంత్ (అత్తిలి), షణ్ముఖ ప్రియ(కుముదవల్లి), లక్ష్మీకళ (కొడమంచిలి), హెచ్ఎన్వి సుదీప్ (అత్తిలి), 9వ తరగతికి చెందిన ఎం దుర్గాభవాని(వెంప), జోషిని (గూట్లపాడు), పెదపూడి చాందిని(కొడమంచిలి), లోహిత (గూట్లపాడు), 10వ తరగతికి చెందిన ఐ రక్షిత శ్రీనాగవైష్ణవి (కొమ్ముచిక్కాల), లావణ్య (కొడమంచిలి ), ఎస్.సతీష్(అత్తిలి), ఆనందబాబు(కొడమంచిలి) ఉన్నారన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఎన్జీవోస్ అడహక్ కమిటీ ఏర్పాటులో భాగంగా బుధవారం పశ్చిమగోదావరి జిల్లా కమిటీని ఏర్పాటుచేశారు. స్థానిక త్యాగరాజ భవనంలో జరిగిన కార్యక్రమానికి ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అడ్హక్ కమిటీ చైర్మన్గా ఉదిసి వెంకట పాండురంగారావు, కన్వీనర్గా పోతన సుకుమార్, ఫైనాన్స్ మెంబర్గా అల్లూరి శ్రీనివాస రాజు, మెంబర్లుగా ఎంఆర్కే రాజు, దేవాబత్తుల నాగదేవి, ఇంజేటి రమేష్, సుంకర వెంకటేష్ను నియమించారు. టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెనుమరెడ్డి శ్రీనివాసులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గాతల జేమ్స్, ఎన్జీజీవో సంఘం రాష్ట్ర కార్యదర్శులు శివ ప్రసాద్, రామ్ ప్రసాద్, జెఏసి నాయకులు ఆర్ఎస్ హరనాథ్, రాష్ట్ర ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు పాము శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల్లో నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500, సెకండరీ గ్రేడ్ టీచర్లకు రూ.10 వేలు గౌరవ వేతనం అందిస్తామన్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించి ఈ నెల 5లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏలూరు నగరంలోని 7వ డివిజన్ మున్సిపల్ ఉర్దూ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ), ఏలూరు మండలంలోని అబుల్ కలాం ఆజాద్ నగరపాలక ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ), స్కూల్ అసిస్టెంట్ (లెక్కలు ఉర్దూ), స్కూల్ అసిస్టెంట్ (భౌతికశాస్త్రం ఉర్దూ), కై కలూరు మండలం ఆటపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సంస్కృతం), కలిదిండి మండలం మట్టగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(హిందీ), నూజివీడు మండలం ముక్కోలుపాడు మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(జీవ శాస్త్రం) ఖాళీలున్నాయన్నారు.
బధిరుల పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు


