
కక్షతోనే గోడ కూల్చివేత
దెందులూరు : మండలంలోని చల్ల చింతలపూడిలో ఎంపీటీసీ సభ్యురాలు సింహాద్రి పద్మావతి, మాజీ సర్పంచ్ సింహాద్రి శ్రీమన్నారాయణ ఇంటి ప్రహరీ గోడను టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరినందుకే రాజకీయ కక్ష ధోరణితోనే కూల్చివేశారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి విమర్శించారు. ఆదివారం ఎంపీటీసీ సింహాద్రి పద్మావతి, మాజీ సర్పంచ్ సింహాద్రి శ్రీమన్నారాయణలను కొఠారు ఫోన్లో పరామర్శించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని సూచించారు. ఇటువంటి సంఘటనలు ఎంత మాత్రం సరైనవి కాదని, గోడ కూల్చివేతపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని ఆయన చెప్పారు. ఈ విషయంలో బాధితులకు అండగా ఉండి న్యాయపోరాటం చేస్తామన్నారు. కూల్చివేతలో విధులు నిర్వహించినవారు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు.
వీఆర్వో వివరణ
గోడ కూల్చివేతపై వీఆర్వో సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా.. చల్ల చింతలపూడి గ్రామంలో రోడ్లకు రెండు వైపులా మూడు అడుగుల మేరకు తొలగించాలని గ్రామ పంచాయతీ తీర్మానం చేసిందని చెప్పారు. పంచాయతీ తీర్మానం మేరకు ప్రహరీ గోడ తొలగించినట్టు చెప్పారు.
ఎంపీటీసీ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కొఠారు పరామర్శ
అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా