
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం: మండలంలోని పలు ప్రాంతాలు మట్టి అక్రమార్కులకు అడ్డాగా మారాయి. రాత్రి వేళల్లో సైతం సాగునీటి చెరువుల నుంచి మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొయ్యలగూడెం సమీపంలోని శ్రీరామ గట్టు చెరువు, కన్నాయిగూడెం సమీపంలోని ఊర చెరువుల నుంచి గురువారం వందల కొద్ది ట్రక్కుల్లో మట్టి అక్రమ రవాణా కొనసాగింది. పంట పొలాలకు వెళ్లే రహదారులు ధ్వంసం అవుతున్నాయని శ్రీరామ గట్టు చెరువు ఆయకట్టు రైతులు ఆందోళన చేపట్టి మట్టి వాహనాలను అడ్డుకున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు. కన్నాయిగూడెం ఊర చెరువు నుంచి రాత్రి వేళల్లో జేసీబీ యంత్రాలతో మట్టి అక్రమ తోలకాలను నిర్వహించారు. మట్టి అక్రమార్కులకు నియోజకవర్గ పెద్దల అండదండలు ఉండడం వల్ల తామేమి చేయలేకపోతున్నామని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. రవాణా అవుతున్న మొత్తం మట్టి ఇటుక బట్టీలకు, కమర్షియల్ లేఅవుట్ల నిర్మాణానికి తరలించి జేబులు నింపుకుంటున్నారు.