
ఓఎన్జీసీ అధికారులు న్యాయం చేయాలి
ఇరగవరం: ఓఎన్జీసీ అధికారులు తమకు న్యాయం చేయాలని రైతులు మంగళవారం ఆందోళన చేశారు. ఇరగవరం, సరిహద్దు ప్రాంతం అర్జునుడుపాలెం గ్రామాలకు చెందిన 21 మంది రైతుల వద్ద నుంచి సుమారు 8 ఎకరాలు లీజు ప్రాతిపదికన 2023వ సంవత్సరంలో పంటకు ఎకరాకు రూ.82,200, చెట్లకు రూ.6,500 చొప్పున నగదు చెల్లించే విధంగా తీసుకున్నారు. అనంతరం ఓఎన్జీసీ డ్రిల్ పనులు ప్రారంభించారు. అయితే అక్కడ ఆయిల్ పడలేదు. దీంతో రైతులకు కేవలం ఒక పంటకు మాత్రమే డబ్బులు వేశారు. తరువాత రైతులకు చెప్పకుండా ఓఎన్జీసీ అధికారులు మొత్తం సామాగ్రిని తరలించుకుపోతున్నారు. దీనిపై ఓఎన్జీసీ అధికారులను ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పకపోవడంతో మంగళవారం ఓఎన్జీసీ డ్రిల్ దగ్గర నుంచి తరలిస్తున్న వాహనాలను రైతులు అడ్డుకుని ధర్నా చేశారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రాజమండ్రి తహసీల్దార్ జాలి జనార్ధన్, సివిల్ ఇంజనీరు శేషు వచ్చి రైతులతో మాట్లాడారు. వచ్చే జూలై నెలలో ఒక పంట డబ్బులు, తరువాత మరో పంట డబ్బులు అకౌంట్ల్లో వేయడం జరుగుతుందని, లీజు పూర్తయ్యే వరకు రైతులకు లీజు డబ్బులు చెల్లిస్తామని రాతపూర్వకంగా రాసి ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.