
వైఎస్ఆర్ కడప స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలు
ఏలూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ డాక్టర్ వైఎస్ఆర్ కడప స్పోర్ట్స్ స్కూల్లో 4, 5 తరగతుల్లో ప్రవేశాలు నిర్వహిస్తోందని ఏలూరు జిల్లా డీఎస్డీఓ బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 4వ తరగతి ప్రవేశానికి ఏప్రిల్ 1, 2015 నుంచి మార్చి 31, 2017 మధ్య జన్మించి ఉండాలన్నారు. అలాగే ఏప్రిల్ 1 2014 నుంచి మార్చి 31 2016 మధ్య జన్మించినవారు 5వ తరగతిలో ప్రవేశించవచ్చని వివరించారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకూ దరఖాస్తుల పరిశీలన చేసి శాప్ షార్ట్ లిస్ట్ విడుదల చేస్తుందన్నారు. అనంతరం జూలై 1 నుంచి 3వ తేదీ వరకూ జిల్లాస్థాయి, జూలై 10 నుంచి 11వ తేదీ వరకూ రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. వివరాలకు 98663–17326, 99487 79015 నంబర్లలో సంప్రదించాలన్నారు.
మట్టి ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలి మృతి
ముసునూరు: మట్టి అక్రమ తోలకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. మట్టి ట్రాక్టర్ ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని గోపవరంలో చోటుచేసుకుంది. గ్రామంలో పగలూ రాత్రి తేడా లేకుండా మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మట్టి ట్రిప్పులు అధికంగా వేయాలనే ఆత్రంతో లైసెన్స్లు లేని, డ్రైవింగ్ కూడా సరిగా రాని వారు కూడా గ్రామంలో మట్టి ట్రాక్టర్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మట్టి ట్రాక్టరు వెనుక నుంచి ఢీ కొట్టడంతో గ్రామానికి చెందిన వృద్ధురాలు గడ్డం అంజమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు.