
నీట్ పరీక్షలకు 97.5 శాతం హాజరు
తాడేపల్లిగూడెం : జిల్లాలో నీట్–యూజీ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. తాడేపల్లిగూడెంలోని రెండు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సీహెచ్ నాగరాణి తనిఖీ చేశారు. 97.5 శాతం విద్యార్థులు హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. ఏపీ నిట్ కేంద్రంలో 1,128 మందికి 1,108 మంది, శశి ఇంజనీరింగ్ కళాశాలలో 758 మందికి 739 మంది హాజరయ్యారన్నారు. పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణరెడ్డి, ఆర్డీఓ కతీబ్ ఖౌసర్ భానో, పరీక్షల కో–ఆర్డినేటర్ ఎన్.జయరామ్ ఉన్నారు.
ఏలూరులో ప్రశాంతంగా..
ఏలూరు (ఆర్ఆర్పేట) : జిల్లాలోని ఐదు కేంద్రాల్లో నీట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కేంద్రాల్లోకి విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి అనుమతించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్రాల్లోకి పంపించారు. మొత్తం 1,200 మంది విద్యార్థులకు 1,162 మంది హాజరయ్యా రు. ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 240 మందికి 232 మంది, కస్తూరిబా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో 360 మందికి 347 మంది, ఆర్ఆర్పేట సుబ్బమ్మదేవి హైస్కూల్ కేంద్రంలో 240 మందికి 234 మంది, గోపన్నపాలెం కేంద్రీయ విద్యాలయ కేంద్రంలో 240 మందికి 235 మంది, గోపన్నపాలెం హైస్కూల్ కేంద్రంలో 120 మందికి 114 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫిజిక్స్ ప్రశ్నలు క్లిష్టంగా, బయోలజీ సులువుగా, కెమిస్ట్రీ ప్రశ్నలు మోస్తరుగా ఉన్నట్టు విద్యార్థులు అన్నారు.