
కూరగాయలకు కృత్రిమ కొరత
కూరగాయలకు కృత్రిమ కొరత
హోల్సేల్లో తగ్గినా.. రిటైల్లో ధరల మోత
వినియోగదారుల జేబులకు చిల్లు
పట్టించుకోని అధికారులు
తాడేపల్లిగూడెం: వంకాయలు కిలో రూ.120.. చిక్కుళ్లు రూ.160.. క్యాబేజీ రూ.80.. దొండకాయలు రూ.60.. దోసకాయలు రూ.60.. ఇలా ఏ రకం కూరగాయ ధర అడిగినా వినియోగదారులకు షాక్ తగిలేలా సమాధానాలొస్తున్నాయి. వరదల కారణంగా దూరప్రాంతాల నుంచి కూరగాయలు రావడం, మార్కెట్లకు తక్కువగా సరుకు రావడం వంటి కారణాలతో ఏ రకం అడిగినా ‘సెంచరీ’ మార్కు దిశగా ధరలు ఉన్నాయి. జిల్లాలోని లంక ప్రాంతాల్లో వరద ప్రభావంతో దొండకాయలు, పొట్లకాయలు, దోసకాయలు వంటి వాటి ధరలు పెరిగాయి.
కర్ణాటక ప్రాంతం నుంచి క్యారెట్ రావడంతో వాటి ధరకు రెక్కలు వచ్చాయి. బీట్రూట్, క్యాప్సికం, బీన్స్ అదే మార్గంలో నడిచాయి. తెల్ల వంకాయలు, పందిరి బీర ధరలు కిలో రూ.120 వరకు చేరి భయపెట్టాయి. పచ్చిమిర్చి సైతం కిలో వంద మార్కు దాటగా, అల్లం కొత్తది రూ.120, పాతది రూ.200 టచ్ చేసింది. కొత్తిమీర కట్ట కూడా రూ.60 చేరి రికార్డు సృష్టించింది. వీటితో పాటు ఉల్లి ధరలు రూ.50 దాటి పరుగులు తీశాయి. రెండు రోజుల క్రితం వరకు ధరలు ఇలానే ఉన్నా బుధవారం నుంచి కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి.
అయితే రిటైల్ మార్కెట్లో వ్యాపారులు ఇంకా కృత్రిమ కొరతను సాకుగా చూపి పాత ధరలకే విక్రయిస్తున్నారు. హోల్సేల్ మార్కెట్లో అన్నిరకాలు 40 శాతం వరకు ధరలు తగ్గినా రిటైల్ వ్యాపారులు మాత్రం తగ్గించడం లేదు. హోల్సేల్ ధరలకు 20 శాతం లాభం వేసుకుని రిటైల్ మార్కెట్లో విక్రయించాల్సి ఉండగా పాత ధరలకే కూరగాయలను విక్రయిస్తుండటంతో వినియోగదారుల జేబులకు చిల్లుపడుతోంది. వీటిని నియంత్రించాల్సిన అధికారులు మిన్నకుండా ఉన్నారు.