
భీమవరంలోని భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రాన్ని పరిశీలిస్తున్న శ్యామ్సుందర్, రాధిక
భీమవరం: సమగ్ర శిక్ష ద్వారా దివ్యాంగ పిల్లలకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేసేందుకు ఏప్రిల్లో వైద్య నిర్ధారణ శిబిరాలను నిర్వహించనున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పి.శ్యామ్సుందర్, సహిత విద్య రాష్ట్ర సహాయ సమన్వయకర్త డాక్టర్ ఎస్.రాధిక చెప్పారు. బుధవారం పట్టణంలోని భవిత శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా వారు మాట్లాడారు. ప్రత్యేక ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సహిత విద్య రిసోర్స్ పర్సన్స్ దివ్యాంగ పిల్లల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వైద్య నిర్ధారణ శిబిరాలను సద్వినియోగం చేసుకునేలా పాటుపడాలన్నారు. డాక్టర్ రాధిక మాట్లాడుతూ భవిత కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ అనంతరం సామర్థ్యాలు అభివృద్ధి చెందిన పిల్లలను మెయిన్ స్ట్రీమ్ చేయాలన్నారు. జిల్లా సహిత విద్య, సమన్వయకర్త సీహెచ్ఎస్వీ సుబ్రహ్మణ్యం, సహిత విద్య సహాయ సమన్వయకర్త టి.శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్స్ లిల్లీ గ్రేస్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.