
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ అజిత వేజెండ్ల
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను పక్కాగా గుర్తించి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఎస్పీ అజిత వేజెండ్లతో కలిసి సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాల గుర్తింపు, ముందస్తు చర్యలపై జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, ఏఈఆర్వోలు, నియోజకవర్గ ఈఆర్ఓలు, పోలీసు అధికారులు, తదితరులతో సమీక్షించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అనుకూలమైన వాతావరణానికి అధికారులు కృషి చేయాలన్నారు. ఇప్పటికే జిల్లాలోని నియోజకవర్గాల్లో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, ప్రాంతాల్లో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే కొన్ని సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లను గుర్తించారని, ఇంకా ఏవైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే తక్షణమే గుర్తించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ అజిత వేజెండ్ల మాట్లాడుతూ గత ఎన్నికలలో ఎదురైన ప్రతి సంఘటనపై సమీక్షించుకోవాలన్నారు. ఏ కారణంగా గొడవలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పక్కా ప్రణాళికతో ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలన్నారు. ఇన్చార్జి డీఆర్వో బి.శివనారాయణరెడ్డి, ఏఎస్పీ వి.భీమారావు, సెబ్ ఏఎస్పీ ఏటీవీ రవికుమార్, ఆర్డీవోలు కె.శ్రీనివాసులు రాజు, కె.చెన్నయ్య, తణుకు మున్సిపల్ కమిషనర్ బి.వెంకట రమణ పాల్గొన్నారు.
రిటర్నింగ్ అధికారులదే గురుతర బాధ్యత
ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులపై గురుతర బాధ్యత ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమావేశమై ఎన్నికల విదివిధానాలపై కలెక్టర్ సమీక్షించారు. అధికారులు సిబ్బంది సమన్వయం చేసుకుని ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావు లేదన్నారు. కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో రాజకీయ పార్టీలు నిర్వహించే సమావేశాలకు డీఎస్పీ నుంచి అనుమతి పొందాలన్నారు. రాజకీయ పార్టీల సమావేశాల ఖర్చును ఆ యా పార్టీల ఖాతాల్లో జమచేయాలన్నారు.