
డీఆర్వో కృష్ణవేణి
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని.. రక్తసంబంధీకులు కావాలనే నినాదంతో జిల్లా రెడ్క్రాస్ సంస్థ ముందుకు సాగుతోందని జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి అన్నారు. సోమవారం ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో రెడ్క్రాస్ వ్యవస్థాపకుడు హెన్నీ డ్యునాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో గతేడాది మే నెలలో రెడ్క్రాస్ ప్రారంభించారని, జిల్లాలో ఉత్తమ సేవలందించినందుకు కలెక్టరు పి.ప్రశాంతి గవర్నర్ చేతులమీదుగా పతకం అందుకున్నారన్నారు. రూ.1.80 కోట్లతో రాయలంలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుచేశామన్నారు. విపత్తుల సమయంలో నిత్యావసర వస్తువుల సరఫరా, రక్తదాన శిబిరాలు, నేత్రపరీక్షలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
దివ్యాంగుల హక్కుల చట్టంపై..
దివ్యాంగుల హక్కుల చట్టం పటిష్ట అమలుకు అధికారులు కృషి చేయాలని డీఆర్వో కృష్ణవేణి అన్నారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయి దివ్యాంగుల హక్కుల సమావేశాన్ని కమిటీ సభ్యులతో కలిసి నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ దివ్యాంగుల జీవన ప్రమాణాల మెరుగుదల, వారి హక్కుల పరిరక్షణ, మరిన్ని సదుపాయాలు కల్పనకు చట్టం పనిచేస్తుందన్నారు. దివ్యాంగుల సంక్షేమంపై పలు సూచనలు చేశారు. దివ్యాంగులకు సంబంధించిన కేసులను దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం నమోదు చేయడం లేదని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అల్లాడి నటరాజ్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎస్పీకి నివేదిస్తామని డీఆర్వో తెలిపారు. అందరూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారి జీవీవీ సత్యనారాయణ, డీఎంహెచ్ఓ డి.మహేశ్వరరావు, డీఈవో ఆర్వీ రమణ, డీఆర్డీఏ పీడీ ఎన్ఎస్ఎస్ వేణుగోపాల్, డీపీఓ ఎం.నాగలత తదితరులు పాల్గొన్నారు.