
మిల్లర్లతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్ రూరల్: జిల్లాలోని రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) మిగులు(బ్యాలెన్స్)ను ఈనెల చివరి వరకు పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్, పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో ఖరీఫ్, రబీ 2021–22, 2022–23 సంవత్సరాలకు సంబంధించి ధాన్యం సేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు బియ్యం కొరకు గన్నీ సంచులు ఇప్పించాలని, ఎఫ్సీఐ గోదాముల్లో ధాన్యం నిల్వకు స్థలాలను పెంచాలని కోరారు. జిల్లా వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఏరియా మేనేజర్, ఎఫ్సీఐ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని, అలాగే సీఎంఆర్ బ్యాలెన్స్ను ఈనెల చివరి వరకు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్, పౌరసరఫరాల శాఖ అధికారి గౌరీశంకర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంపత్కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ పి.ప్రావీణ్య