
నిబద్ధతతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు
వనపర్తిటౌన్: నిబద్ధత, అంకిత భావంతో పని చేసే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంతోష్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని డిపో ఆవరణలో మహబూబ్నగర్ రీజియన్ త్రైమాసిక ప్రగతి చక్రం అవార్డు (ఉత్తమ ఉద్యోగుల అభినందన) సభ నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రగతి చక్రం అవార్డులు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ చాటిన సిబ్బందిని సన్మానించడంతో మరింత ఉత్సాహంతో పని చేస్తారని, తోటి సిబ్బంది కూడా తాము కూడా గుర్తింపు పొందాలని కష్టపడి పని చేస్తారని, దీంతో సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్లు భవానీ ప్రసాద్, లక్ష్మీధర్మ, వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్, వివిధ డిపోల మేనేజర్లు, సూపర్వైజర్లు, ట్రాఫిక్, మెకానికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, వనపర్తి ఆధ్వర్యంలో ఎస్సీ యువతకు మూడు నెలల పాటు ఉచిత వృత్తి శిక్షణకు ఎస్సీ కార్పొరేషన్, నేషనల్ అకాడమీ నిర్మాణ సంస్థ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు మల్లికార్జున్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్కు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉండి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు, ప్లంబింగ్, ఫాల్సీలింగ్కు 45 ఏళ్లలోపు వయసు ఉండి 5వ తరగతి చదివినవారు, టైలరింగ్ కొరకు 45 ఏళ్లలోపు వయసు ఉండి 5వ తరగతి చదివిన మహిళలు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మే నెల 14 వరకు దరఖాస్తులను జిల్లాకేంద్రంలోని పాత మున్సిపాలిటీ దగ్గర ఉన్న నేషనల్ అకాడమీ నిర్మాణ సంస్థ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్నంబర్ 99853 75692 సంప్రదించాలని సూచించారు.
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
వనపర్తిటౌన్: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ నియంత్రణకు పాటుపడాలని ఆర్డీఎస్ స్వచ్ఛందసంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని చింతల హనుమాన్ ఆలయం, రావూస్ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న మసీదులో బాల్య వివాహాల నిర్మూలన వాల్పోస్టర్లను ఆవిష్కరించి.. అర్చకులు, పాస్టర్లు, ముల్లాలకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాలు చేయడం, అందుకు సహకరించడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో యాక్సిస్ టు జస్టిస్ వనపర్తి జిల్లా కో–ఆర్డినేటర్ ఎడ్విన్ థామస్, గద్వాల జిల్లా కో–ఆర్డినేటర్ కొమ్మ చంద్రశేఖర్, మహబూబ్నగర్ జిల్లా కో–ఆర్డినేటర్ విశ్వకాంత్, ఆర్డీఎస్ సీనియర్ సిబ్బంది శ్రీలక్ష్మి, హరికృష్ణ, కన్నన్ కుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

నిబద్ధతతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు