
మనసున్న ’మాస్టారు’
● అవయవ దానానికి ముందుకొచ్చిన విజయ్ కుమార్ ● మిమ్స్ వైద్య కళాశాలకు అంగీకార పత్రం అందజేత
నెల్లిమర్ల: నెల్లిమర్ల మండల రిటైర్డ్ ఎంఈఓ ఈపు విజయ్ కుమార్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన తదనంతరం శరీరాన్ని మిమ్స్ వైద్య కళాశాలకు దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల సమ్మతితో అవయవ దానం చేస్తున్నట్లు మిమ్స్ వైద్యులకు మంగళవారం అంగీకార పత్రాన్ని అందజేశారు. తద్వారా మనసున్న మాస్టారుగా నిరూపించుకున్నారు. నెల్లిమర్ల మండల విద్యాశాఖాధికారి–2గా విధులు నిర్వర్తించి, తాజాగా ఉద్యోగ విరమణ పొందిన ఈపు విజయ్ కుమార్ తన తదనంతరం పార్థివ దేహాన్ని మిమ్స్ వైద్య కళాశాలకు అందజేస్తున్నట్లు ప్రకటించారు. తన భార్య, కుమార్తె సమ్మతితో కళాశాల డీన్ డాక్టర్ లక్ష్మీకుమార్, అనాటమీ డిపార్ట్మెంట్ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్కు మంగళవారం డిక్లరేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా విజయ్కుమార్ను అభినందిస్తూ మిమ్స్ వైద్యులు అభినందన పత్రం అందజేశారు. విజయ్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా నాలుగు దశాబ్దాల పాటు సేవలందించారు. సారిపల్లి ప్రాథమిక పాఠశాలలో మొట్టమొదట ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అలాగే నటుడిగా నాటకరంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్కుమార్ మాట్లాడుతూ తన అవయవ దానంతో మెడికల్ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనలాగానే నేత్ర, అవయవ దానానికి మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు.