
ఉపాధ్యాయుడి వీరంగం
రాజాం: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడనే విమర్శలు ఇటీవల అధికమయ్యాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో వెంటనే చేరిపోయి మిగిలిన వారిపై కక్ష సాధింపులకు
పాల్పడుతున్నాడంటూ పలువురు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. కుల సంఘాల నేతగా గొప్పలు చెప్పుకుంటూ సొంత కులంలోనే వర్గాలను పోషిస్తున్నాడంటూ మండిపడుతున్నారు. సంబంధిత ఉపాధ్యాయుడిపై ఈనెల 17న రాజాం సర్కిల్ కార్యాలయంలో సొంత కులానికి చెందిన పలువురు బాధితులు ఫిర్యాదుచేయడంతో విషయం బయటకు వచ్చింది. బొద్దాం గ్రామంలో రజక కులానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజాం పట్టణంలోని గాయత్రి కాలనీలో నివాసముంటున్నాడు. గతంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీలో పెత్తనం చేసిన ఈ ఉపాధ్యాయుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేరి వీరంగం వేస్తున్నాడు. గ్రామంలో రజక కులానికి చెందిన కొంతమందిపై వివక్ష చూపి వర్గపోరు ప్రారంభించాడు. రోజువారీ కూలితో బతికే రజకులపై కక్షగట్టి చుట్టు పక్కల గ్రామాల్లో జరుగుతున్న పండగల్లో వారికి కూలి లేకుండా చేస్తున్నాడు. ఈ మేరకు కొంతమంది రజకులు ఈ ఉపాధ్యాయుడి తంతుపై రాజాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమలో కొంతమంది కూటమికి ఓటు వేయలేదని చెప్పి బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నాడని, ప్రభుత్వ ఉద్యోగిననే బాధ్యత లేకుండా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారాలు చేయడం, రాయితీ రుణాలు మన వర్గానికి ఇచ్చారంటూ పబ్లిష్ చేసి మిగిలినవారిని కించపరచడం, గ్రామాల్లో జరిగే కథ, కార్యక్రమాలకు మిగిలిన కుటుంబాలను రానివ్వకుండా అడ్డుకోవడం చేస్తున్నాడని ఎ.వీరస్వామి, కె.నాగరాజు, వి.అచ్యుతరావు, వై.మంగయ్య తదితరులు వాపోతున్నారు.
చేపల చెరువు నిధులు స్వాహా
తమ కులానికి చేపల చెరువుల నిమిత్తం వచ్చిన రూ. 1.80 లక్షలు నగదు దోచేశాడని, అడిగినవారిని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. అధికారపార్టీ ఎమ్మెల్యే అండదండలు తనకున్నాయని చెబుతూ గ్రామంలో వివాదాలు సృష్టిస్తున్నాడని పేర్కొన్నారు. సంబంధిత ఉపాధ్యాయుడిపై కలెక్టర్కు, విద్యాఽశాఖాధికారికి ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉపాధ్యాయుడి బరితెగింపుపై గ్రామస్తులు సైతం మండిపడుతున్నారు.
కూటమికి ఓటు వేయలేదంటూ గ్రామంలో రాజకీయాలు వర్గ వివక్షతో వివాదాలు సంఘానికి వచ్చిన డబ్బులు గోల్మాల్
రాజాం పోలీస్స్టేషన్లో బాధితుల ఫిర్యాదు