
యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్
విజయనగరం ఫోర్ట్: వ్యవసాయంలో యంత్రాల వినియోగాన్ని పెంచడంతో కూలీల కొరతను అధిగమించవచ్చని, క్షేత్ర పరిశీలనలు 150–200 మంది రైతులతో జరిగేలా చూడాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ శివన్నారాయణ వ్యవసాయ సిబ్బందికి సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ఉత్తర కోస్తాలోని అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల వ్యవసాయ పరిశోధన, విస్తరణ మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ శాస్త్రవేత్త రైతుకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. రైతులకు అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందించాలన్నారు. రైతు సేవా కేంద్రాల ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయని చెప్పారు. రైతుల ఆదాయం పెంచేలా పరిశోధనలు జరగాలన్నారు. పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చితే ఆదాయం పొందవచ్చని తెలిపారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. పరిశోధన సంచాలకుడు డాక్టర్ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ అభ్యదయ రైతుల పొలాల్లో మినీకిట్లు, ప్రదర్శన కేంద్రాల పరిశీలనల్లో రైతుల భాగస్వామ్యం పెరగాల్సి ఉందన్నారు. నైర వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భరత్లక్ష్మి మాట్లాడుతూ చెరకు పంట ఇంకా వాణిజ్య పంటగానే ఉందని తెలిపారు. నాబార్డు డీడీఎం మాట్లాడుతూ యువత వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పెరగాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు, శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథస్వామి, శాస్త్రవేత్తలు టి.ఎస్.ఎస్.కె.పాత్రో, కె. లక్ష్మణ్, అనూరాధ, త్రివేణి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
క్షేత్ర పరిశీలనలకు ప్రాధాన్యం పెరగాలి
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ
విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ శివన్నారాయణ
జెడ్పీ సమావేశ మందిరంలో ఉత్తర కోస్తా వ్యవసాయ పరిశోధన, విస్తరణ మండలి సమావేశం