
చికిత్స పొందుతున్న విశ్వనాథం
పార్వతీపురం: భార్య రాజీకి రావడంలేదని మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటనపై పార్వతీపురం ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలం ఎంఆర్ నగరానికి చెందిన బి.విశ్వనాథం భార్య వెంకటలక్ష్మి రెండేళ్ల క్రితం గృహహింస చట్టం కింద భర్తపై కేసు పెట్టింది. కేసులో రాజీకి రావాలని భర్త ఎన్నిసార్లు కోరినప్పటికీ ఆమె ససేమిరా అనడంతో మనస్తాపానికి గురై మంగళవారం సా యంత్రం ఎలకల మందు తాగేశాడు. ఈ విషయాన్ని బంధువులు గమనించి ఆటోలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి చికిత్సకోసం తరలించారు.
చిత్రహింసలు భరించలేక మహిళ..
పార్వతీపురం: పెళ్లి అయిన కొద్ది నెలలకే అత్తింటివారి వేధింపులు, భర్త చిత్ర హింసలను తట్టులేక ఓ గృహిణి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటపై మంగళవారం పార్వతీపురం అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మక్కువ మండలకేంద్రానికి చెందిన ఎస్.కనక మహాలక్ష్మి అత్తింటివారు అదనపు కట్నం తీసుకురావాలన్న వేధింపులు, భర్త శ్రీనివాసరావు మానసికంగా చిత్రవధ చేస్తుండడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగేసింది. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం మక్కువ ఆస్పత్రికి తీసుకువెళ్లగా ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
108 లో ప్రసవం
విజయనగరం ఫోర్ట్: పట్టణంలోని శాంతినగర్కు జె.మోహిని 108 వాహనంలో ప్రసవించింది. మోహిని పురిటినొప్పులతో బాధ పడుతుండగా కుటుంబసభ్యులు సోమవారం అర్ధరాత్రి 108 అంబులెన్సుకు ఫోన్ చేశారు. సమాచారం మేరకు సిబ్బంది చేరుకుని మోహినిని అంబులెన్సులో ఎక్కించి ఆస్పత్రికి తరలించడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వాహనంలోనే ఈఎంటీ అప్పలనాయుడు, ట్రైనీ ఈఎంటీ కుసమకుమారిలు ప్రసవం జరిపించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను మెరుగైన చికిత్స కోసం ఘోషా ఆస్పత్రికి తరలించారు.

మోహిని ప్రసవించిన మగబిడ్డను చూపుతున్న ఈఎంటీ అప్పలనాయుడు


చికిత్స పొందుతున్న కనక మహలక్ష్మి