చేతకాక.. కమిషనర్‌ లేక! | - | Sakshi
Sakshi News home page

చేతకాక.. కమిషనర్‌ లేక!

Jun 7 2025 1:12 AM | Updated on Jun 7 2025 1:12 AM

చేతకా

చేతకాక.. కమిషనర్‌ లేక!

జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా సాగింది. కూటమి ప్రభుత్వ అసమర్ధతపై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల మండిపాటు, కూటమి కార్పొరేటర్ల అసంబద్ధ వాదనలతో రసాబాసగా మారింది. ప్రభుత్వం ఏర్పడ్డాక.. అడ్డగోలుగా మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడంలో చూపిన చొరవ, జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించడంలో చూపకపోవడంపై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. ప్లకార్డులతో మేయర్‌ పోడియంను చుట్టుముట్టి, తక్షణమే జీవీఎంసీకి రెగ్యులర్‌ కమిషనర్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు. దాదాపు 15 నిముషాలు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల నినాదాలతో కౌన్సిల్‌ హాల్‌ మార్మోగింది.

డాబాగార్డెన్స్‌: నూతన మేయర్‌ పీలా శ్రీనివాస్‌ అధ్యక్షతన శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశం వాద, ప్రతిపాదనలతో హోరెత్తింది. ప్రధాన అజెండాలోని 27 అంశాలతో పాటు, టేబుల్‌ అజెండాలోని 6 అంశాలు సభ్యుల చర్చకు వచ్చాయి. వీటిలో 3 ప్రధాన అజెండా(1, 10, 14) అంశాలు, 2 టేబుల్‌(1, 6) అజెండా అంశాలు తప్ప, మిగిలినవన్నీ ఆమోదం పొందాయి. ఉదయం ప్రారంభమైన సమావేశం రాత్రి వరకు కొనసాగింది.

రెగ్యులర్‌ కమిషనర్‌ నియామకం ఎప్పుడు?

జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం కాగానే వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లు సభను అడ్డుకున్నారు. ప్లకార్డులతో మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టి, జీవీఎంసీకి తక్షణమే రెగ్యులర్‌ కమిషనర్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు. కీలకమైన కమిషనర్‌ పోస్టును నెలల తరబడి భర్తీ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని నినాదాలు చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు వారి నినాదాలతో సభ దద్దరిల్లింది. మేయర్‌ పీలా శ్రీనివాసరావు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మొదట పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాప తీర్మానం చేయాలని సూచించడంతో, వైఎస్సార్‌సీపీ సభ్యులు తమ సీట్లలో కూర్చున్నారు. అనంతరం, ఉగ్రదాడి బాధితులకు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు.

ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ రాకపోవడంతో బ్రేక్‌

ఇన్‌చార్జ్‌ కమిషనర్‌, కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నందున సమావేశానికి హాజరుకాలేదు. దీనిపై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కమిషనర్‌ లేకుండా సభను నిర్వహించడాన్ని తప్పుబట్టారు. వారి నిరసనతో మేయర్‌ పీలా శ్రీనివాసరావు 15 నిమిషాల్లోనే టీ బ్రేక్‌ ప్రకటించారు. దాదాపు అరగంట తర్వాత కమిషనర్‌ హాజరు కావడంతో సభ తిరిగి ప్రారంభమైంది.

జీరో అవర్‌ కోసం పట్టు

జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌ పీలా అజెండాలోని అంశాలపై చర్చ ప్రారంభించగా, కార్పొరేటర్లు తమ వార్డు సమస్యల పరిష్కారం కోసం జీరో అవర్‌ కావాలని పట్టుబట్టారు. మేయర్‌ దీనికి అంగీకరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ జీవీఎంసీకి నాలుగు నెలలుగా కమిషనర్‌ లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు రోజుల్లో కమిషనర్‌ను నియమించేలా చూడాలని సూచించారు.

పీలా గోవింద్‌ హాజరుపై అభ్యంతరం

జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ హాజరుపై డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌ అభ్యంతరం తెలిపారు. ఏ హోదాలో ఆయన వచ్చారని ప్రశ్నించగా, పీలా గోవింద్‌ ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అని, ప్రభుత్వ ప్రత్యేక ఉత్తర్వుల మేరకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చినట్లు అధికారులు వివరించారు.

నైట్‌ ఫుడ్‌కోర్టుపై మళ్లీ రగడ

జైలు రోడ్డులోని నైట్‌ ఫుడ్‌కోర్టుపై మరోసారి రగడ చెలరేగింది. అనధికారికంగా అనేక మంది స్టాల్స్‌ ఏర్పాటు చేసుకున్నారని, వీటిని తొలగించాలని కౌన్సిల్‌లో పలుమార్లు చర్చించి తీర్మానం చేసినా చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ బిపిన్‌కుమార్‌ జైన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో కార్పొరేటర్‌ పీవీ సురేష్‌ మాట్లాడుతూ, వార్డుల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఫిర్యాదు చేస్తే, జోనల్‌ కమిషనర్‌ తేలికగా ‘అలాగే జరుగుతాయని’మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

‘ఎఫ్‌ఆర్‌యూ’ ఒప్పందం ఎప్పుడైనా రద్దు చేయొచ్చు

శ్రీహరిపురంలోని ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్‌ నిర్వహణ కోసం రూ.1.20 కోట్లు కేటాయించడం, విజయ (బెహరా) వెల్ఫేర్‌ సొసైటీకి చెల్లింపుల ఆమోదంపై జీవీఎంసీ కౌన్సిల్‌లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ పీవీ సురేష్‌ సహా ఇతర కార్పొరేటర్లు మాట్లాడుతూ సొసైటీ ఉచిత సేవలకు బదులు డబ్బులు వసూలు చేస్తోందని, 30 ఏళ్ల లీజుపై కూడా అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ హరేందిరప్రసాద్‌, సొసైటీ సరిగా పనిచేయకపోతే విచారణ జరిపి ఒప్పందాన్ని ఎప్పుడైనా రద్దు చేస్తామని మేయర్‌ పీలా శ్రీనివాసరావు ద్వారా హామీ ఇచ్చారు.

రెగ్యులర్‌ కమిషనర్‌ను

నియమించకపోవడంపై

వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఆగ్రహం

జీవీఎంసీపై కూటమి నిర్లక్ష్యం

కమిషనర్‌ను నియమించాలంటూ

వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు

ప్లకార్డుల ప్రదర్శన

27 అజెండా అంశాలు..

6 టేబుల్‌ అజెండా అంశాలు

ప్రధాన అజెండాలో 3, టేబుల్‌

అజెండాలో 2 అంశాలు వాయిదా

సుదీర్ఘంగా సాగిన జీవీఎంసీ

కౌన్సిల్‌ సమావేశం

జీవీఎంసీలో ఘోస్ట్‌ ఉద్యోగులు

జీవీఎంసీలో ‘ఘోస్ట్‌ ఉద్యోగులు’ఉన్నారని, పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. అలాంటి వారిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ డెయిరీ వ్యర్థాలు పంట పొలాల్లోకి చేరి రైతులను ఇబ్బంది పెడుతున్నందున, డ్రైన్‌లు నిర్మించాలని పల్లా సూచించారు.

వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయరా?

జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు పలు కీలక ఆరోపణలు చేశారు. జీవీఎంసీ పరిధిలో దీర్ఘకాలంగా ఒకే చోట పని చేస్తున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్లపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, వారిని ఎందుకు బదిలీ చేయడం లేదని ప్రశ్నించారు. కీలకమైన జీవీఎంసీకి నెలల తరబడి కమిషనర్‌ లేకపోవడం దారుణమన్నారు. పనుల టెండర్లలో అంచనాల కంటే 25 శాతం తక్కువకు కాంట్రాక్టర్లు పనులు ఎలా చేస్తున్నారని నిలదీస్తూ, అధికారులు ఎక్కువ ఎస్టిమేషన్లు వేస్తున్నారా? లేదా కాంట్రాక్టర్లకు లీకులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.

ఎవడ్రా నువ్వు..!

జీరో అవర్‌లో వాగ్వాదం చోటుచేసుకుంది. కార్పొరేటర్‌ కంపా హనోక్‌ మాట్లాడుతుండగా.. వైఎస్సార్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ అల్లు శంకరరావు మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన హనోక్‌, ‘ఎవడ్రా నువ్వు’అంటూ నోరు పారేసుకున్నారు. ఈ ఘటనతో సభలో కొంత గందరగోళం నెలకొంది. వెంటనే రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు కల్పించుకుని, వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి, పార్టీ మారిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హనోక్‌కు చురకంటించారు. హనోక్‌ వెంటనే క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

వాయిదాపడ్డ అంశాలు..

సీనియర్‌ అసిస్టెంట్‌ డి.వెంకట్రావు స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తును సభ్యులు వ్యతిరేకించారు. అతనిపై అనేక ఆరోపణలు ఉన్నందున, పూర్తిస్థాయి విచారణ జరిపే వరకు దరఖాస్తును వాయిదా వేశారు.

87వ వార్డులోని కూర్మన్నపాలెం వద్ద ఎంవీవీ అండ్‌ ఎంకే పార్క్‌కు 150 కేఎల్‌డీ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు సంబంధించిన పైప్‌లైన్‌ ప్రతిపాదనకు సభ్యులు అభ్యంతరం తెలపడంతో వాయిదా పడింది.

స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా 15 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల అభివృద్ధి ప్రతిపాదనను సభ్యులు వ్యతిరేకించారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల కాలపరిమితి మార్చి 31తో ముగిసిందని, కేవలం ఇద్దరు ముగ్గురు సిబ్బందితో రూ.కోట్ల విలువైన ప్రాజెక్టులు జరుగుతున్నాయని, దీనిపై సుదీర్ఘంగా చర్చించాలని కోరడంతో వాయిదా వేశారు.

పరిపాలన సౌలభ్యం కోసం జోనల్‌ పరిధి మార్పులు చేసే ప్రణాళికను కూటమి సభ్యులతో సహా పలువురు కౌన్సిల్‌ సభ్యులు వ్యతిరేకించడంతో వాయిదా వేశారు.

వీటితోపాటు టీడీఆర్‌లు, కోడి మాంసం వ్యర్థాలు, అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌, షాప్‌ రూంలు, పార్క్స్‌ వంటి అంశాలపై చర్చ అవసరమని సభ్యులు కోరడంతో వాటిని కూడా వాయిదా వేశారు.

ఆమోదించిన అంశాల్లో ప్రధానమైనవి

రూ.1.96 కోట్లతో 2వ వార్డు కుమ్మరివీధి నుంచి నమ్మివానిపేట కాలనీ బీటీ రోడ్డు విస్తరణ

జీవీఎంసీలోని ఈఈ–1 పరిధిలో సివిల్‌ పనుల పర్యవేక్షణకు అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను ఏడాది పాటు కొనసాగింపు

రూ.55.40 లక్షల అంచనా వ్యయంతో 19వ వార్డు పెదవాల్తేరులో చేపల మార్కెట్‌ పునరుద్ధరణ

ఇంజినీరింగ్‌ విభాగం ఈఈ–5 పరిధిలో 18 మంది టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, సెక్యూరిటీ గార్డుల కొనసాగింపు

చేతకాక.. కమిషనర్‌ లేక!1
1/3

చేతకాక.. కమిషనర్‌ లేక!

చేతకాక.. కమిషనర్‌ లేక!2
2/3

చేతకాక.. కమిషనర్‌ లేక!

చేతకాక.. కమిషనర్‌ లేక!3
3/3

చేతకాక.. కమిషనర్‌ లేక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement