
వీసీబీ నికర లాభం రూ.71.77 కోట్లు
● ఈ ఏడాది మరో 5 కొత్త బ్రాంచీలు ● బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు
సీతంపేట: ది విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్(వీసీబీ) ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.71.77 కోట్ల నికర లాభం ఆర్జించి 110వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటోందని బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలిపారు. ద్వారకానగర్లోని బ్యాంకు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుతో మాట్లాడారు. తమ బ్యాంకు 55 బ్రాంచీలతో 1,11,593 మంది సభ్యులను కలిగి ఉందన్నారు. వీసీబీలో షేరు ధనం రూ.389.55 కోట్లు కాగా, డిపాజిట్లు రూ.4354.73 కోట్లు, రుణాలు రూ.3436.47 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. రుణాల్లో 95 శాతం కోటి రూపాయల కంటే తక్కువ మొత్తం అందజేశామన్నారు. సామాన్యులకు ప్రాధాన్యమిస్తూ 1.30 లక్షల మంది రుణగ్రహీతల అవసరాలకు తగినట్టు సేవలందించినట్టు తెలిపారు. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి దాదాపు 7,800 కోట్లకు ఆర్థిక లావాదేవీలు చేరుకున్నట్లు వెల్లడించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి 8,600 కోట్లు లక్ష్యంగా, ఈ ఏడాది మరో 5 కొత్త శాఖలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు. నాన్ షెడ్యూల్ హోదాలో ఉన్న తమ బ్యాంకుకు షెడ్యూల్ హోదా కల్పించేందుకు వీలుగా ఆర్బీఐకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని కాకతీయ ఫంక్షన్ హాలులో జరగనున్న 110వ మహాసభలో డివిడెండ్ ప్రకటించనున్నట్టు తెలిపారు. సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్లు సూరపనేని నాగభూషణ చౌదరి, ఏజే స్టాలిన్, నామాన కామరాజు, వి.చంద్రశేఖర్, జె.వి.సత్యనారాయణమూర్తి, గుళ్లపల్లి జనార్ధనరావు, సి.హెచ్.ఆదినారాయణ శాస్త్రి, సీఈవో వి.వి.వి.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.