
అందాల తీరంపై అలల దాడి
● విశాఖ తీరంలో ఆందోళనకర పరిస్థితులు ● తరచూ కోతకు గురవుతున్న బీచ్లు ● నేలకొరుగుతున్న కొబ్బరి చెట్లు ● ఇంకెప్పుడు రక్షణ చర్యలు?
ఏయూక్యాంపస్: వాతావరణ మార్పుల ప్రభావం విశాఖ సుందర తీరంపై తీవ్రంగా పడుతోంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే సాగరతీరం.. ఇప్పుడు తరచూ కోతకు గురవుతోంది. గత దశాబ్ద కాలంలో జరిగిన నష్టం కంటే ఇటీవల తీర ప్రాంతం ఘోరంగా దెబ్బతింటోంది. రుషికొండ నుంచి ఆర్.కె.బీచ్ వరకు అడుగడుగునా తీరం కోతకు గురవడం ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చి.. తీరానికి పునరుజ్జీవం పోయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
ప్రకృతి విధ్వంసం
గతంలో కేవలం తుపానులు, పెను తుపానుల సమయంలో మాత్రమే కనిపించే ఈ పరిస్థితి.. ఇప్పుడు అల్పపీడనాలు, ఆవర్తనాల సమయంలో కూడా తలెత్తుతోంది. యారాడ నుంచి భీమిలి వరకు సుమారు 35 కిలోమీటర్ల తీర ప్రాంతం తరచూ కోతకు గురవుతున్నట్లు నిపుణులు గుర్తించారు. యారాడ బీచ్, కోస్టల్ బ్యాటరీ, ఆర్.కె.బీచ్, కురుసుర సబ్మైరెన్ మ్యూజియం, చిల్డ్రన్స్ పార్క్, జోడుగుళ్లపాలెం, రుషికొండ, భీమిలి వంటి ప్రాంతాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాల సమయంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల తీరం కోతకు గురవుతుంది. కొన్ని సార్లు ఈశాన్య రుతుపవనాల సమయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంటోంది.
కొబ్బరి చెట్ల కన్నీళ్లు
ఇటీవల పెరిగిన సముద్ర కెరటాల తీవ్రతకు కొబ్బరి వనాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. ఒక్కొక్కటిగా నేలకొరుగుతున్నాయి. ‘విక్టరీ ఎట్ సీ’ఎదురుగా పచ్చదనంతో కళకళలాడే కొబ్బరి చెట్లు ఇప్పుడు కూలిపోయాయి. వాటి వెనుక ఉన్న మరో రెండు వరసల చెట్లు కెరటాల ధాటికి దెబ్బతినే ప్రమాదంలో ఉన్నాయి. గతంలో ఈ వనాల చుట్టూ రాళ్లతో నిర్మించిన కంచె కూడా కెరటాల ఉధృతిని తట్టుకోలేకపోయింది. ఈ ప్రభావం సమీపంలోని ఇతర కొబ్బరి చెట్లపైనా పడుతుండటంతో.. వాటి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది.
కూలుతున్న స్తంభాలు
సముద్ర కెరటాల తీవ్రతకు తీరంలోని ఇసుక భారీగా కోతకు గురవుతోంది. ప్రస్తుతం కురుసుర సబ్మైరెన్ మ్యూజియం వద్ద ఇసుక పూర్తిగా కొట్టుకుపోయింది. గతంలో ఏర్పడిన కోతను దృష్టిలో ఉంచుకుని అక్కడ రాళ్లు, కాంక్రీట్ దిమ్మెలు ఏర్పాటు చేసినప్పటికీ.. కెరటాల ప్రభావం వాటి పక్కనే ఉన్న ఇసుక మేటలపై పడుతోంది. దీంతో సబ్మైరెన్ సమీపంలోని కొబ్బరి వనం చుట్టూ ఉన్న ఇసుక కూడా కోతకు గురవుతోంది. మరికొన్ని రోజుల్లో ఆ వనం కూడా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో వేసిన మట్టి కూడా కరిగిపోతోంది. తీరంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు, విద్యుత్ దీపాల స్తంభాలూ నేలకొరుగుతున్నాయి.
దెబ్బతింటున్న రక్షణ గోడలు
కొన్ని ప్రాంతాల్లో రహదారిని తాకేలా ఉధృతంగా కెరటాలు ఎగసిపడుతున్నాయి. దీని వల్ల రహదారికి, సముద్ర తీరానికి మధ్య నిర్మించిన రక్షణ గోడలు దెబ్బతింటున్నాయి. గత ఏడాది కాలంలో రామకృష్ణ బీచ్, పాండురంగాపురం ప్రాంతాల్లో రెండు చోట్ల రక్షణ గోడలు కూలిపోగా.. వాటి స్థానంలో కొత్తవి నిర్మించారు. అయితే కెరటాల తీవ్రత పెరుగుతుండటంతో భవిష్యత్తులో తీర ప్రాంత పరిరక్షణ మరింత సవాల్గా మారనుంది.
సమష్టి కృషి అవసరం
విశాఖ తీర పరిరక్షణకు తక్షణమే నిపుణుల సూచనలతో కూడిన ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, జిల్లా యంత్రాంగం సమష్టిగా ఈ దిశగా కృషి చేయాలి. విశ్వవిద్యాలయాలు, సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు, సివిల్ ఇంజనీరింగ్ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తీరప్రాంత పరిరక్షణకు అనుసరిస్తున్న విజయవంతమైన పద్ధతులను అధ్యయనం చేయాలి. మన పరిస్థితులకు అను కూలంగా ఉండే వాటిని అమలు చేయడంపై అధికారులు ఆలోచించాలని పర్యాటకులు కోరుతున్నారు.
సహజసిద్ధంగా వదిలేయాలి
విశాఖ సముద్ర తీరానికి ఒకవైపు కొండలు ఉన్నాయి. దీని ఫలితంగా అర్ధచంద్రాకార బీచ్లు ఏర్పడ్డాయి. వీటిని సహజంగా వదిలేయాలి. ఇక్కడ నిర్మాణాలు చేయడం, శాశ్వత కట్టడాలు ఏర్పాటు చేయడం ఎంతమాత్రం సరికాదు. అదే సమయంలో సముద్రానికి అడ్డుగా గోడ కట్టాలనుకోవడం, జియో ట్యూబ్లు ఏర్పాటు చేయడం మరింత నష్టాన్ని చేస్తాయి. ఇప్పటికే వీటిని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఆర్థికంగా, పర్యావరణ పరంగా తీవ్ర నష్టం చవిచూశాం.
–ఆచార్య కాకాని నాగేశ్వరరావు, జియో ఇంజినీరింగ్ విభాగం, విశ్రాంత ఆచార్యులు