
జూలో వన్యప్రాణుల ఆరోగ్యంపై దృష్టి
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కును మంగళవారం జూ ఆరోగ్య కమిటీ సందర్శించింది. జూ క్యూరేటర్ జి.మంగమ్మ, అసిస్టెంట్ క్యూరేటర్లతో కలిసి కమిటీ సభ్యులు హైదరాబాద్లో నెహ్రూ జూ పార్కు విశ్రాంతి వైద్యుడు ఎం.నవీన్ కుమార్, ఆర్ఏడీడీఎల్(పశు సంవర్ధక శాఖ) డీడీ డాక్టర్ పి.మోహిని కుమారి, వీపీసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.మహేష్ తదితరులు జూలో వన్యప్రాణులు, వాటి ఎన్క్లోజర్లను పరిశీలించారు. ఇక్కడ జంతువులు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అనంతరం జూ క్యూరేటర్ చాంబర్లో సమావేశం నిర్వహించారు. జంతువుల సంరక్షణ, వాటి సంక్షేమం, వాటికి అందించాల్సిన పోషక విలువలతో కూడిన ఆహారం గురించి చర్చించారు. ప్రస్తుతం వేసవి ఎండలు తీవ్రతను బట్టి చేపట్టదలచిన నిర్వహణ చర్యలు, వాటికి అందించాల్సిన వైద్య సేవల గురించి చర్చించారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న 19 ఏళ్ల చిరుత(హర్ష)కు అందించాల్సిన వైద్యం గురించి ప్రత్యేక దృష్టిపెట్టాలని జూ వైద్య సిబ్బందికి సూచించారు. జూలో మార్మోసెట్ కోతులు, స్కివరెల్ కోతులు, మీర్కాట్, జిరాఫీ, రాయల్ బెంగాల్ టైగర్స్, తెల్ల పులులు, సింహాలు, హైనాలు, స్లాత్ బేర్, వాటర్ మానిటర్ బల్లులు, ఆఫ్రికన్ చిలుకలు సంతానోత్పత్తికి సంబంధించిన పలు సూచనలు, సలహాలు చేశారు.